విశ్వమూర్తి.. వసంతదీప్తి
వైభవంగా వసంతోత్సవం
పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి,అమ్మవార్లు
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన వధూవరులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులను వసంతోత్సవ మండపంలో కొలువుదీర్చారు. స్వామి, అమ్మవార్లకు పలు రకాల అభిషేకాలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. మధ్యాహ్నం సూర్యపుష్కరణి వద్ద త్రిశూలానికి ఆగమోక్తంగా అభిషేకాలు చేశారు.
ఆగమోక్తంగా కేడిగ వాహనసేవ
శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లకు కేడిగ వాహనసేవ నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ, పూజల అనంతరం స్వామి అమ్మవార్లను కేడిగవాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు.ఈ కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా కలశోధ్వాసన
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని శైవాగమన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఏర్పాటు చేసిన యాగ కలశాలను ఉద్వాసన చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి ధృవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి స్వామి, అమ్మవార్లు సింహ, కామధేనువు వాహనాలపై పురవీధుల్లో ఊరేగారు.
నేడు పల్లకీ సేవ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పల్లకీ సేవ
నిర్వహించనున్నారు.


