గడ్డి తరలిస్తున్న ట్రాక్టర్కు ‘షాక్’!
– 12 లక్షల ఆస్తి నష్టం
కార్వేటినగరం: విద్యుత్ తీగలు తగిలి గడ్డి తరలిస్తున్న ట్రాక్టర్ దగ్ధమైన ఘటన కార్వేటినగరం మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. కార్వేటినగరానికి చెందిన ఓ రైతు నాగలాపురం నుంచి గడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చారు. అయితే వీధిలో విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగడంతో గడ్డితో పాటు ట్రాక్టర్ కూడా పూర్తిగా కాలి పోయింది. పుత్తూరు అగ్ని మాపక కేంద్రం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపు గడ్డితో పాటు ట్రాక్టర్ కాలిపోయింది. సుమారు రూ.12 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు ట్రాక్టర్ యజమాని వాపోయారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు విమర్శలు గుప్పించారు. అదే విధంగా చాకలివాని ఎస్టీ కాలనీకి వెళ్లే మార్గంలో కూడా చెరువు కట్టపై చేతికందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని ఆరోపించారు.


