
వీఆర్వోపై దాడి
ఐరాల: భూ తగాదా విషయమై వీఆర్వోపై దాడి చేసిన ఘటన మండలంలోని తెల్లగుండ్లపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని తెల్లగుండ్లపల్లెకు చెందిన వీఆర్వో రాధయ్యకు మల్లారపల్లెలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో ఉన్న చింత చెట్లను కోస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ తమ భూమి అంటూ అడ్డుకుంది. ఆపై ఆమె పోలీసులను ఆశ్రమించడంతో వారు ఇరువురినీ పిలిచి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వీఆర్వో ఇంటి దగ్గర ఉండగా మల్లారపల్లెకు చెందిన కొంతమంది ఆయనపై దాడి చేసి గాయపరిచారు. గాయపడిన వీఆర్వోను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ భూమిలో చింత చెట్లు కోసి విక్రయిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు, మల్లారపల్లెకు చెందిన ఏడుగురు అకారణంగా దాడి చేసి గాయపరిచినట్లు వీఆర్వో వాపోయారు. ఈ విషయంపై పోలీసులు విచారిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళ దుర్మరణం
శ్రీరంగరాజపురం : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో పుత్తూరు జాతీయ రహదారి చిన్నతయ్యూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు చిన్నతయ్యూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ (60) రోడ్డు పక్కన నడిచి వెళుతుండగా, మండలంలోని శెట్టివనత్తం గ్రామానికి చెందిన బాబు కుమారుడు వినోద్(25) పుల్లూరు క్రాస్ రోడ్డు నుంచి వారి స్వగ్రామానకి బైక్పై వస్తుండగా చంద్రమ్మను ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రమ్మ మృతి చెందింది. వినోద్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు.

వీఆర్వోపై దాడి