
పలమనేరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక రేపు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీన పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేసి, పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఐరాలలో చిరుత సంచారం
ఐరాల: మండలంలోని నగరి, చెంగనపల్లె గ్రామాల్లో చిరుత పులుల సంచరిస్తున్నాయి. శనివారం చెంగనపల్లె సమీపంలోని బంగారుచింతల గ్రామానికి చెందిన రైతు మల్లీశ్వర్రెడ్డి మామిడి తోటలో చిరుత పులి పాదముద్రలను పోలిన ముద్రలు కనిపించాయి. విషయాన్ని వెంటనే ఐరాల బీట్ అధికారి రెడ్డిప్రసాద్కు తెలిపారు. దీంతో ఆయన ఉదయం మామిడి తోటలో పాదముద్రల గుర్తులున్న ప్రాంతానికి వెళ్లి వాటిని సేకరించారు. పాదముద్రలను గుర్తించడం కోసం ఫొటోలను ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. కాగా ఈ పాదముద్రలు దగ్గర దగ్గరగా ఉన్నాయని, చిరుత పులి పాదముద్రలు దూరం దూరంగా ఉంటాయని చెప్పారు. అయితే నగరి, చెంగపల్లె సమీపంలోని పెద్దకొండలో నాలుగు చిరుత పులులు సంచరిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం పెద్దకొండ నుంచి దుర్గంకు వెళ్లే దారిలో మామిడి తోటలో నీటి కోసం చిరుత పులులు వస్తున్నట్లు చెప్పారు.