
పకడ్బందీగా ప్రవేశ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన నిర్వహించే ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాల ప్రవేశాల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో శుక్రవారం నిర్వహించే ప్రవేశ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల, నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, క్యాంఫర్డ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 756 మంది విద్యార్థుల పాఠశాల అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అదే పరీక్ష కేంద్రాలతో పాటు గిరింపేట మున్సిపల్ పాఠశాలలో జూనియర్ కళాశాలల అడ్మిషన్లకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 1,082 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, జిల్లా కో ఆర్డినేటర్లను నియమించారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకూడదన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ వరలక్ష్మి, జిల్లా గురుకుల కళాశాలల కోఆర్డినేటర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు.