పేదలకు బియ్యం కోత..! | - | Sakshi
Sakshi News home page

పేదలకు బియ్యం కోత..!

Apr 22 2025 1:53 AM | Updated on Apr 22 2025 1:53 AM

పేదలక

పేదలకు బియ్యం కోత..!

● జిల్లాలో అరకొరగా బియ్యం సరఫరా ● వేలిముద్రలు వేసుకుని బియ్యం ఇవ్వని వైనం ● ముగిసిన పంపిణీ గడువు

కాణిపాకం: కూటమి ప్రభుత్వం పేదల కడుపు కొడుతోంది. డీలర్ల చేతివాటానికి కార్డుదారులను బలి చేస్తోంది. పలుచోట్ల వేలిముద్రలు వేసుకుని బియ్యం ఇవ్వకుండా డీలర్లు చేతులు దులుపుకున్నారు. రేషన్‌ పంపిణీ గడువు సోమవారంతో ముగియడంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. అయినా పౌరసరఫరాల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 1,390 చౌక దుకాణాల పరిధిలో 5,36,686 రేషన్‌ కార్డులున్నాయి. వంద శాతం రేషన్‌ పంపిణీకి మిగులు బియ్యం ఆధారంగా ప్రతి నెలా జిల్లాకు 9 నుంచి 10 టన్నుల రేషన్‌ బియ్యం అవసరమవుతోంది. అయితే ఈ నెల 8,300 టన్నుల బియ్యం మాత్రమే సరఫరా జరిగింది.

కోతలిలా..

జిల్లాలో ఈ నెలకు 9 వేల టన్నుల రేషన్‌ బియ్యం అవసరం కాగా కేవలం 8 వేల టన్నులు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. వెయ్యి టన్నుల వరకు జిల్లాకు కోత పెట్టింది. ఆ తర్వాత 300 టన్నుల బియ్యాన్ని సరఫరా చేసి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన్న 6 షాపులకు సరిపడ బియ్యం ఉందని ప్రభుత్వం సరఫరాను ఆపేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 40 షాపులకు 10 శాతం బియ్యం సరఫరా చేసినట్లు చెబుతున్నారు. మరికొన్ని షాపులకు 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే సరుకు చేరిందని వెల్లడించారు. దీని దెబ్బకు జిల్లా వ్యాప్తంగా రేషన్‌ పంపిణీ గందరగోళంగా మారింది. కొన్ని చోట్ల రేషన్‌ సకాలంలో ఇవ్వక ఇబ్బంది పెట్టేశారు. మరికొన్నిచోట్ల కార్డుదారుల నుంచి ముందుగానే వేలిముద్రలు వేసుకుని, బియ్యం వరకు సర్దుబాబు చేశారు. కొన్ని షాపుల్లో వేలిముద్రలు వేసుకుని సరుకులు లేదని చెప్పేశారు. కొంత మంది అసలు రేషన్‌ రాలేదని తిప్పి పంపించేశారు. సోమవారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 5,36,686 కార్డులదారులగాను 4,69,468 మంది రేషన్‌ తీసుకున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ లెక్కన్న 67,218 మంది రేషన్‌కు దూరమయ్యారు.

ఐరాలలో మండలంలో ఇలా..

బియ్యం పంపిణీ గడువు ముగిస్తున్నా బియ్యం ఇవ్వకపోవడంతో ఆదివారం ఐరాల మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కార్డుదారులు రేషన్‌ కార్డులు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీఆర్వో ద్వారా సరుకులు ఇస్తున్నారని.. ఆయన వేలిముద్రలు వేసుకుని సరుకులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 70 మందికి ప్రతినెలా సరుకులు ఇవ్వడం లేదని తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

రెండు నెలలుగా ఇవ్వలేదు..

ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ సరుకులతోనే మూడు ముద్దలు తింటున్నాం. ఆ బియ్యం రెండు నెలలుగా రేషన్‌ ఇవ్వకపోతే మేం ఎట్టా బతకాలి. డీలర్‌ షాప్‌కు వస్తే స్టాక్‌ రాలేదంటున్నారు. బయట ఇదే రేషన్‌ బి య్యం కేజీ రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నా రు. సన్నబియ్యం కేజీ రూ. 60 ఆ ధరలు చూస్తేనే మా కడుపులు మండిపోతున్నాయి.

–సుధాకర్‌, పుల్లూరు, ఐరాల

మిగులు ఏమైనట్టో..

జిల్లాలో 250 చౌక దుకాణాల పరిధిలో ఈ నెల బియ్యం కొరత వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన పంపిణీలో సగటున లెక్క వేసి, బియ్యం డీలర్లకు సరఫరా చేశారు. గత నెల మిగులు బియ్యం, తాజాగా సరఫరా అయిన స్టాక్‌తో ఏ సమస్య రాకూడదు. అయితే గత రెండు, మూడు మాసాలుగా బియ్యం కొరత వస్తోందంటున్నారు. దీనికి కారణమేమిటో అధికారులే చెప్పలేకపోతున్నారు.

జిల్లాలో రేషన్‌ వివరాలు

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు 41

చౌకదుకాణాలు 1390

మొత్తం రేషన్‌కార్డులు 5,36,686

రేషన్‌ తీసుకున్న కార్డుదారులు 4,69,468

రేషన్‌ తీసుకోనివారు 67,218

పుంజుకున్న అక్రమ వ్యాపారం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో రేషన్‌ అక్రమ వ్యాపారం పుంజుకుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలో 250 మందిపైగా డీలర్లను తొలగించారు. దీంతో అక్కడి నుంచి ఆరంభమైన అక్రమవ్యాపారం..జోరుగా సాగింది. గత పది నెలల కాలంలో 80 మెట్రిక్‌ టన్నుల బియ్యం పట్టుబడగా, అందుకు సంబంధించిన వ్యాపారులంతా కూటమి పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.

ఇట్టా చేస్తే ఎట్టా...

మేము పేదోళ్లం. మా కడుపులు కొడితే ఎట్టా. రేషన్‌ ఇవ్వకుండా మానేస్తే ఏం చేయాలి..ఏం తినాలి. దీనే నమ్ముకుని బతుకుతుండాం. ఈనెల రేషన్‌ ఇవ్వకుండా చేస్తే...దిక్కుమొక్కుల లేన్నోళ్లం. ప్రతి నెల ఇది మాదిరిగానే జరిగితే కష్టం. అధికారులు ఓ తూరి మా బతుకులు చూసి రేషన్‌ ఇచ్చేలా చూడండా.

–అదెమ్మ, పుల్లూరు గ్రామం, ఐరాల

పేదలకు బియ్యం కోత..! 
1
1/3

పేదలకు బియ్యం కోత..!

పేదలకు బియ్యం కోత..! 
2
2/3

పేదలకు బియ్యం కోత..!

పేదలకు బియ్యం కోత..! 
3
3/3

పేదలకు బియ్యం కోత..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement