
నేడు పలమనేరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేయాలని కోరారు.
నేడు పోలీసు గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.
ముఖ్యమంత్రా..మజాకా!
– సీఎం జన్మదినం.. ప్రత్యేక పూజలకు ఉత్తర్వులా?
కాణిపాకం : హవ్వా..నవ్విపోదురుగాక నాకేంటి అనే చందంగా మారింది కూటమి పరిస్థితి.. సీఎం జన్మదినానికి..ప్రత్యేక పూజలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆధ్యాత్మికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా.. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రత్యేక గణపతి హోమం చేశారు. ఎమ్మెల్యే మురళీ మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదానం చేశారు. అయితే సీఎం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజల కోసం ఉత్తర్వులు జారీ చేయడం కాణిపాకంలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చర్రితలో ఇలాంటి ఉత్తర్వులు ఎప్పుడూ లేదంటూ కాణిపాక గ్రామస్తులు, ఉభయదారులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు.. డీఎస్సీ తొలి సంతకానికే దాదాపు 11 నెలలు సాగదీశారు.. ఇక నిరుద్యోగ అభ్యర్థుల ఒత్తిడి తాళలేక ఎట్టకేలకు బాబు జన్మదిన కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా పరీక్ష ఎప్పడూ ఒకే రోజు నిర్వహించే డీఎస్సీని ఇప్పుడు నెల రోజులు నిర్వహించేలా మెలిక పెట్టారు. ఎందుకు ఇలా చేశారంటే.. ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడం కోసమే ఇలా జరిపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కాగా కనీసం అయిదు మాసాలు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాల్సిన ప్రభు త్వం కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితం కావడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు.

నేడు పలమనేరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక