
అవినీతి సామ్రాజ్యం!
తహసీల్దార్
● కూటమి ప్రభుత్వం రాకతో చెలరేగిన వైనం ● చిన్నపనికై నా ప్రజలకు తప్పని వేధింపులు , వసూళ్లు ● హైకోర్టులో కేసులు, కలెక్టర్కు ఫిర్యాదులు ● చివరకు ఏసీబీకి పట్టుబడిన మండల మేజిస్ట్రేట్
పుంగనూరు : రైతు నుంచి లంచం తీసుకుంటూ సదుం మండల ఇన్చార్జి తహసీల్దారు మారుఫ్ హుస్సేన్, వీఆర్ఓ మహబూబ్ బాషా శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సదుం తహసీల్దార్ బాగోతం అంతా ఇంత కాదు ఆ వివరాలు ఇలా.. ఆయన ఓ మండల మేజిస్ట్రేట్ .. సామాన్యులను కూడా వదలకుండా వేధించడం ఆయన నైజం.. చిన్న పనికై న రోజుల తరబడి కార్యాలయానికి తిప్పించుకోవడం , లొంగకపోతే తన తహసీల్దార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన హోదాతో ఆదేశాలు ఒక్కొక్కశాఖకు ఇవ్వడం ఆ శాఖ ద్వారా రైతులు , ప్రజలను వేధించడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. దీనికి బెంబేలెత్తిపోయిన ప్రజలు నేరుగా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఆయన అక్రమాలపై రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అంత జరిగినా తహసీల్దారు మారుఫ్ హుస్సేన్ బుద్ధి మాత్రం మారలేదు. కార్యాలయానికి వచ్చే వారిని పిలిపించుకుని రూ. లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ అవినీతికి కేరాఫ్గా సదుం మండలంలో నిలిచిపోయారు.
కూటమి నేతలతో చెలరేగాడు
సదుం తహసీల్దార్గా కూటమి ప్రభుత్వంలో బదిలీపై హుస్సేన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆరు నెలల కాలంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలు అంతులేకుండా పోయింది. కూటమి నేతల అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు.
తహసీల్దార్ బాధితులు
సదుం మండల తహసీల్దార్ హుస్సేన్ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పలువురు ఆయన బాధితులు మండలంలో ఉన్నారు. దిగువకురప్పల్లెకి చెందిన మల్లయ్య అనే వ్యక్తికి తిమ్మానాయునిపల్లె గ్రామ దాఖల సర్వే నంబరులో 13.1లో 3.58 ఎకరాల పొలం ఉంది. ఇందులో ప్రభుత్వం పొలాన్ని ప్రాజెక్టుకు తీసుకుంది. మిగులు భూమితో పాటు బోరు బావితో మల్లయ్య పంటలు సాగు చేసుకుంటున్నాడు. తహసీల్దార్ డిమాండ్లకు తలవంచకపోవడంతో అతనిని వేధింపులకు గురి చేశాడు. ఆయన రెండు సార్లు హైకోర్టులో కేసు వేసి తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేయించుకున్నాడు. అలాగే గొంగివారిపల్లెకి చెందిన ప్రసాద్, సుగుణ, చిన్నక్క, రమణ, రాజమ్మలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎర్రాతివారిపల్లెకి చెందిన ఎన్.సురేంద్ర తహసీల్ధార్ అక్రమాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
తహసీల్దారు ఇంట్లో ఏసీబీ తనిఖీలు
చిత్తూరు అర్బన్ : సదుం మండల ఇన్చార్జి తహసీల్దారు హుస్సేన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడటంతో.. చిత్తూరులోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. శనివారం సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక బృందం చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీలో ఉన్న హుస్సేన్ ఇంట్లో దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు, కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.
మా ఉసురు కొట్టుకుంది...
నేను టమాట పండించా. నన్ను రకరకాలుగా వేధిస్తూ తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిపై నేను హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేసి, తహసీల్దార్ ఉత్తర్వులు రద్దు చేయించుకున్నా. నేను లొంగకపోవడంతో కక్ష కట్టి రోజుకొక ఆర్డర్ ఇచ్చి వేధించాడు. బోరుకు విద్యుత్ కనెక్షన్ తొలగించాలని ఆర్డర్ ఇచ్చాడు. అప్పటికీ లొంగకపోవడంతో భూమి, బోరును ప్రజా అవసరాలకు స్వాధీనం చేసుకుంటామంటూ ఆర్డర్ ఇచ్చాడు. ఈలోపు మా ఉసురు కొట్టుకుని తహసీల్దార్ జైలుకు వెళ్లాడు. మాకెంతో సంతోషంగా ఉంది. – మల్లయ్య, దిగువకురప్పల్లె, రైతు, సదుం మండలం

అవినీతి సామ్రాజ్యం!