
సమస్యల పరిష్కారానికి రూ.30 లక్షల నిధులు
కుప్పం : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు సామగుట్టపల్లెలోని పలు సమస్యల పరిష్కారం కోసం కడా పీడీ వికాస్ మరమ్మత్ రూ. 30 లక్షలు మంజూరు చేశారు. బుధవారం రెండో వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా యలాజనూరు, చీగలపల్లి, సామగుట్టపల్లి గ్రామస్తులు ప్రధానంగా డ్రైనేజీలు, పైపు లైన్లు ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గాను వెంటనే రూ.30 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్ర కటించారు. ప్రస్తుతం వేసవి సందర్భంగా తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కంటైనర్లో అగ్నిప్రమాదం
కుప్పం : కుప్పం మీదుగా కోల్కతాకు వెళ్తున్న కంటైనర్లో బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదానికి గురైంది. పాల పదార్థాలు తీసుకుని కోల్కతా వెళ్తున్న ఏసీ కంటైనర్ పట్టణం బైపాసు రోడ్డు విజలాపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. అప్పటికే రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మిగిలిన రూ.10 లక్షల పదార్థాలను మంటల నుంచి కాపాడారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్ఎస్యూలో
యూజీసీ బృందం పర్యటన
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రాజభాషా సమితి బృందం బుధవారం విస్తృత పర్యటన చేపట్టింది. ఇందులో భాగంగా వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అధికారులతో బృందం సభ్యులు డాక్టర్ కిశోర్ కుమార్, వీకే సుదర్శన దేవి సమావేశమయ్యారు. వర్సిటీలో రాజభాషగా ఉన్న హిందీ భాషను కార్యాలయ ఆదేశాలలో ఎంత వరకు అమలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ వర్సిటీలో రాజభాష హిందీ అమలు తీరు సంతృప్తి కరంగా ఉందన్నారు. హిందీ భాషను వర్సిటీలో మరింత విస్తృతం చేసేందుకు అధికారులు, అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. అకడమిక్ డీన్ రజనీకాంత శుక్లా, అధికారులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి రూ.30 లక్షల నిధులు