
చట్టాలపై అవగాహన అవసరం
గంగాధర నెల్లూరు : రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికారి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు. మండలంలోని నాసంపల్లిలో బుధవారం న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా గిరిజనుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భారతి మాట్లాడుతూ.. చట్టం, హక్కుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కుల, మత, ప్రాంతం, లింగ భేదం లేకుండా అందరూ చట్టం ముందు సమానులేనన్నారు. ముఖ్యంగా, బలహీన వర్గాలకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించిందని తెలిపారు. వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గురించి చాలా మందికి తెలిసి ఉండవచ్చన్నారు. ఈ చట్టం వివక్ష , హింస నుంచి కాపాడుతుందని అన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయస్థానాలు మీకు అండగా నిలబడుతాయని చెప్పారు. ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశం ఉందని , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని వీటిని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్.మూర్తి , మండల స్థాయి అధికారులు, సర్పంచ్ నీలావతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం