
నేడు జిల్లాకు అసెంబ్లీ పద్దుల కమిటీ రాక
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర అసెంబ్లీ పద్దుల కమిటీ బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు 11 మంది సభ్యులు మంగళవారం చిత్తూరుకు వస్తారన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మధాహ్నం 2 గంటలకు సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారన్నారు. ఈ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ , బండారు సత్యానంద రావు, జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, మద్దిపాటి వెంకట రాజు, పార్థసారథి వాల్మీకి, పాసిం సునీల్ కుమార్, ఏలూరి సాంబశివ రావు, ఎంఎల్సీలు పర్చూరి అశోక్ బాబు, డా.వెంకట సూర్య నారాయణ రాజు, కళ్యాణి విచ్చేస్తారని కలెక్టర్ వెల్లడించారు.
వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి
చిత్తూరు కలెక్టరేట్ : నిర్భంధ వెట్టిచాకిరీ చట్టరీత్యా నేరమని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నిర్బంధ వెట్టిచాకిరీ బారిన పడుతున్న కూలీలకు విముక్తి కలిగేంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నిర్బంధ వెట్టిచాకిరీ విధానం పౌల్ట్రీ, పరిశ్రమలు, ఇటుకల తయారీ ప్రాంతాలలో చాలా వరకు అమలవుతుంటాయన్నారు. వెట్టిచాకిరీ వల్ల ఆర్థిక, శ్రమ దోపిడీతో ఇబ్బందులకు లోనవుతుంటారని తెలిపారు. అటువంటి వ్యక్తులను గుర్తించేందుకు ఆర్డీవో డివిజన్ స్థాయిలో తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్మిక శాఖ, డీఆర్డీఏ, డ్వామా, జెడ్పీ సీఈవో, తదితర అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. నిర్భంధ కూలీలకు పునరావాసం కల్పించిన అనంతరం సంక్షేమ పథకాలతో ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై ముద్రించిన గోడపత్రికలు, కరపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, రోప్స్ సంస్థ చైర్మన్ ధనశేఖర్ పాల్గొన్నారు.