భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అంతర్జాతీయ వాణిజ్య వాహన (కమర్షియల్ వెహికల్స్) మార్కెట్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇటలీకి చెందిన ప్రముఖ ‘ఐవెకో’ కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే వార్షిక అమ్మకాల్లో మిలియన్ (10 లక్షలు) యూనిట్ల మార్కును అధిగమించాలని కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ 29న జరిగిన కంపెనీ రెండో వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కొన్ని విషయాలను వెల్లడించారు.
కమర్షియల్ వెహికల్ బిజినెస్ ప్రత్యేకంగా విడిపోయి స్వతంత్ర సంస్థగా లిస్ట్ అయిన తర్వాత జరిగిన ఈ సమావేశంలో చంద్రశేఖరన్ ప్రసంగిస్తూ ప్రతిపాదిత ఐవెకో కొనుగోలు టాటా మోటార్స్ అంతర్జాతీయ ఆశయాలకు వేగాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
‘ఐవెకో గ్రూప్ ఏకీకరణతో ప్రాథమికంగానే మా ఉమ్మడి వ్యాపారం 6,00,000 వాహనాల వార్షిక వాల్యూమ్తో ప్రారంభమవుతుంది. రాబోయే సంవత్సరాల్లో 10 లక్షల వాహనాల మార్కును సులభంగా దాటగలము. ఈ వ్యూహాత్మక చర్యతో ప్రపంచవ్యాప్తంగా టాప్-4 అతిపెద్ద కమర్షియల్ వెహికల్ తయారీదారుల సరసన టాటా మోటార్స్ నిలుస్తుంది’ అని ఎన్.చంద్రశేఖరన్ అన్నారు.
రెండో త్రైమాసికంలో డీల్ పూర్తి
ప్రస్తుతం ఈ కొనుగోలుకు సంబంధించి తుది విడత రెగ్యులేటరీ అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ డీల్ పూర్తిగా ముగుస్తుందని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐవెకోకు ఉన్న అధునాతన పవర్ ట్రెయిన్, నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతలపై టాటా మోటార్స్కు పూర్తి పట్టు లభిస్తుంది. తద్వారా కంపెనీ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో మరింత బలోపేతం కానుందని చెప్పారు.
ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు


