అదే భయం... అదే పతనం | Stock Market: Sensex Crashes 1471 Points | Sakshi
Sakshi News home page

అదే భయం... అదే పతనం

Mar 14 2026 12:15 AM | Updated on Mar 14 2026 12:15 AM

Stock Market: Sensex Crashes 1471 Points

మార్కెట్లో అమ్మకాల సునామీ 

సెన్సెక్స్‌ 1,471 పాయింట్లు పతనం 

ఇంట్రాడేలో 1,580 పాయింట్లు డౌన్‌ 

488 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 

సెన్సెక్స్‌@ 74,564–నిఫ్టీ@ 23,151

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతోపాటు.. చమురు ధరలు మండుతుండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బేర్‌మంటున్నాయి. వరుసగా మూడో రోజు అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,580 పాయింట్లు పడిపోయి 74,455కు చేరింది. ఆసియా, యూరప్‌ మార్కెట్లు సైతం నీరసించడం సెంటిమెంటును దెబ్బతీసింది.

ముంబై: చమురు ధరల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నాయి. దీనికితోడు ఇంధన కొరత ఆర్థిక వ్యవస్థల వృద్ధికి విఘాతం కలిగించనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో ఆసియాసహా అమెరికావరకూ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దేశీయంగా మూడో రోజూ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 1,471 పాయింట్లు పడిపోయి 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 1,580 పాయింట్లు క్షీణించి 74,455 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 23,112 వరకూ నీరసించింది.  

మెటల్స్‌ మెల్టింగ్‌.. 
ఎన్‌ఎస్‌ఈలో అన్నిరంగాలూ నీరసించగా.. మెటల్స్‌ 5 శాతం పతనమైంది. క్రూడ్‌ సెగతో ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, కన్జూమర్‌ డ్యురబుల్స్, కెమికల్స్‌ 3.6–2.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్‌అండ్‌టీ 7.5 శాతం పడిపోగా.. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్, ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో, టీఎంపీవీ, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఐషర్, అల్ట్రాటెక్, యాక్సిస్‌ బ్యాంక్‌ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. కేవలం టాటా కన్జూమర్, ఎయిర్‌టెల్‌ 2–1 శాతం బలపడ్డాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు పీపా ధర 102 డాలర్లకు ఎగువన కదులుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం పెరగనున్నట్లు తెలియజేశారు.   

చిన్న షేర్లు విలవిల 
తాజా అమ్మకాలతో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 2.5 శాతం పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో 3,439 నష్టపోగా.. కేవలం 858 లాభపడ్డాయి. నగదు విభాగంలో తాజాగా ఎఫ్‌పీఐలు రూ. 10,717 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 9,977 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. గత 4 రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 24,320 కోట్లకుపైగా పెట్టుబడులు వెనక్కి తీసుకోగా..  డీఐఐలు రూ. 27,450 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల 2–6 మధ్య సైతం ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.

మరో 10 లక్షల కోట్లు ఆవిరి
అమ్మకాల సునామీతో ఒక్క రోజులోనే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల విలువకు రూ. 10.24 లక్షల కోట్ల మేర చిల్లు పడింది. రెండు వారాల్లో సెన్సెక్స్‌ 8.3% (6,723 పాయింట్లు) పతనంకాగా.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బీఎస్‌ఈ మార్కెట్‌ విలువలో రూ. 33.68 లక్షల కోట్లు ఆవిరైంది. వెరసి మార్కెట్‌ క్యాప్‌ రూ. 429.82 లక్షల కోట్లు (4.65 ట్రిలియన్‌ డాలర్లు)కు పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement