సామాన్యుడి నెత్తిన వరుస పిడుగులు! | Rising fuel costs squeeze wallets nationwide | Sakshi
Sakshi News home page

సామాన్యుడి నెత్తిన వరుస పిడుగులు!

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:19 PM

Rising fuel costs squeeze wallets nationwide

దాదాపు నాలుగేళ్ల తర్వాత మన దేశంలో.. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభం కారణంగా కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని అటు కేంద్రం ఇటు ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ పెరుగుదల కేవలం పెట్రోల్‌ బంకుల వద్దే ఆగిపోతుందనుకుంటే మన పొరపాటే!. 

పెట్రో వడ్డనతో సామాన్యుడి నెత్తి మీద వరుస పిడుగులు పడే అవకాశం ఉంది. రవాణా మొదలు వంటింటి దాకా.. అన్నింటిపైనా ప్రభావం చూపించే స్పష్టంగా అవకాశం కనిపిస్తోంది. తద్వారా ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సవాలు విసరనుంది. ఈ ప్రభావంతో ఏయే రేట్లు పెరుగుతాయంటే.. 

టికెట్‌ రేట్లు?
పెట్రోలు ధరలు పెరగడం వల్ల కార్లు, బైకులు వాడే ప్రజలకు రోజువారీ ప్రయాణం ఖరీదు అయ్యింది. డీజిల్ ధరలు పెరగడం వల్ల బస్సులు, లారీలు, సరుకు రవాణా ఖర్చులు పెరిగే చాన్స్‌ ఉంది. ఫలితంగా ఆటో, క్యాబ్, మోటర్‌ ట్యాక్సీల ఛార్జీలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. రవాణా ఖర్చులు అన్ని రంగాలపై ప్రభావం చూపుతాయి. కుటుంబాలు వినోదం, అదనపు ఖర్చులను తగ్గించుకోవాల్సి రావొచ్చు!.

గెట్‌ రెడీ..
బంగారం, వెండి బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు పెరిగాయి. కూరగాయలు, నిత్యావరాల రేట్లు పెరుగుతూ పోతున్నాయి. పాలు, పెరుగు ధరలనూ పెంచేశారు. ఇక రేపోమాపో వంటింటి గ్యాస్‌ ధర.. ఆ వెంటనే సబ్బులు, షాంపుల రేట్లు కూడా పెరిగే చాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు అన్నీ రోడ్డు రవాణా ద్వారా సరఫరా అవుతాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈ వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, ఆ భారం వినియోగదారులపై పడనుంది.సో.. వాటి రేట్లు పెరగడం దాదాపు ఖరారైనట్లే!.

ఈ-కామర్స్‌ ద్వారా.. 
లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఫుడ్ డెలివరీ యాప్‌లు, ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. డిస్కౌంట్లను వీలైనంతగా తగ్గించడం.. కనీస ఆర్డర్ విలువ పెరగడం వంటి మార్పులు జరగవచ్చు. ఇది ఇంతటితోనే ఆగిపోలేదు.. 

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు డీజిల్ ఆధారిత ట్రాక్టర్లు, పంపులు వాడాల్సిన పరిస్థితి రావొచ్చు. దీంతో వ్యవసాయ ఖర్చులు పెరిగి, ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల తయారీ, వ్యవసాయం, రిటైల్, సేవలన్నింటిలో ఖర్చులు పెరుగుతాయి. అంతిమంగా.. దీర్ఘకాలంలో ఇంధన ధరలు స్థిరపడకపోతే.. ద్రవ్యోల్బణం మరింత పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement