మంటెత్తనున్న ఇంధన ధరలు | RBI Warns Prolonged High Crude Oil Prices Could Trigger Petrol, Diesel Hike In India | Sakshi
Sakshi News home page

మంటెత్తనున్న ఇంధన ధరలు

May 13 2026 5:21 PM | Updated on May 13 2026 5:26 PM

RBI Warns Prolonged High Crude Oil Prices Could Trigger Petrol, Diesel Hike In India

ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరుగుతున్న చమురు భారంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సవాళ్లను ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు.

వినియోగదారులపై ధరల భారం తప్పదా?

ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107 డాలర్ల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఇప్పటివరకు ఆ భారాన్ని వినియోగదారులపై పడకుండా రక్షిస్తూ వస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.

అయితే, ఈ ఉపశమనం శాశ్వతం కాకపోవచ్చని ఆయన పరోక్షంగా సూచించారు. ‘ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ధరల పెంపును ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చమురు కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉంది’ అని మల్హోత్రా వ్యాఖ్యానించారు.

సరఫరా గొలుసులో అంతరాయాలు

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, సంఘర్షణల వల్ల సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు ఇప్పటికే భారతదేశాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయని గవర్నర్ అంగీకరించారు. ఇలాంటి భారీ సరఫరా షాక్ ఎదురైనప్పుడు కేవలం ద్రవ్యోల్బణ లక్ష్యాల ఫ్రేమ్‌వర్క్ మాత్రమే సరిపోదని, ప్రభుత్వ ఆర్థిక విధానాలతో సమన్వయం చేసుకోవడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • గతంలోనే ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాలు తగ్గించినందున ప్రస్తుత ధరల పెరుగుదలను చమురు కంపెనీలే భరిస్తున్నాయి.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.9 శాతంగా, ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.

  • ఆర్‌బీఐ ప్రస్తుతం ప్రతి నెలా వచ్చే గణంకాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాత్కాలిక ఒడిదుడుకులను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్థిరపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

జూన్ 5న వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం?

ఏప్రిల్‌లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 5న జరగనున్న తదుపరి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే ఉంటే సామాన్యుడిపై అటు ఇంధన ధరలు, ఇటు బ్యాంక్ ఈఎంఐల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

Advertisement
 
Advertisement
Advertisement