పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌- అజంతా ఫార్మా.. జోరు | Sakshi
Sakshi News home page

పిడిలైట్‌- అజంతా ఫార్మా.. జోరు

Published Thu, Oct 29 2020 10:56 AM

Pidilite industries- Ajantha pharma up on positive news - Sakshi

పలు దేశాలలో తిరిగి కరోనా వైరస్‌ కేసులు తలెత్తుతుండటంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు పతన బాట పట్టాయి. దేశీయంగానూ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, అజంతా ఫార్మా కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌
హంట్స్‌మన్‌ గ్రూప్‌నకు చెందిన దేశీ అనుబంధ విభాగాన్ని కొనుగోలు చేయనున్నట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు యూఎస్‌ఏ కంపెనీతో కుదుర్చుకున్న తప్పనిసరి ఒప్పందానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. తద్వారా హంట్స్‌మన్‌ అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ సొల్యూషన్స్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఇందుకు సుమారు రూ. 2,100 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. హంట్స్‌మన్‌ అడ్వాన్స్‌డ్‌.. అరాల్‌డైట్‌, అరాసీల్‌ తదితర ప్రొడక్టులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పిడిలైట్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,578 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,591 వరకూ పురోగమించింది.

అజంతా ఫార్మా
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు ప్రతిపాదించినట్లు హెల్త్‌కేర్‌ కంపెనీ అజంతా ఫార్మా తాజాగా పేర్కొంది. వచ్చే నెల 3న కంపెనీ బోర్డు సమావేంకానున్నట్లు తెలియజేసింది. తద్వారా ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ అంశాన్ని పరిశీలించడంతోపాటు.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం బోర్డు విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అజంతా ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 1,650 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,680 వరకూ లాభపడింది. 

Advertisement
Advertisement