‘రాబోయే ఆదివారం నుంచి పెట్రోల్ బంకులు పనిచేయవు...’ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఒక వైరల్ పోస్ట్ సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, హరియాణా, పుదుచ్చేరి వంటి ప్రముఖ రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులు పూర్తిగా మూసివేస్తారనేది ఆ సందేశం సారాంశం. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులా కనిపించేలా సృష్టించిన ఈ నకిలీ పోస్ట్ వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో వేలాది సార్లు షేర్ కావడంతో వాహనదారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.
అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ఇంధన ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ సున్నితమైన అంశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు చెప్పింది.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ఈ వైరల్ సందేశం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ పీఐబీ ఫ్యాక్ట్-చెక్ బృందం రంగంలోకి దిగింది. ఈ వాదనపై సమగ్ర దర్యాప్తు జరిపిన సంస్థ ఇదొక తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది.
‘దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఆదివారాల్లో పెట్రోల్ పంపులను మూసివేయాలని ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమే. పౌరులెవరూ ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మవద్దు. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దు’ అని పీఐబీ విజ్ఞప్తి చేసింది.
అకస్మాత్తుగా ఎందుకిలా?
ప్రస్తుతం పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరుడుగట్టిన ఇంధన లభ్యత కొరత ఏర్పడింది. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో సింహభాగం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తగా ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో కీలకం. ప్రధాని పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం సంసిద్ధత మాత్రమే కానీ, భయాందోళనలు సృష్టించడం కాదు.
ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు!


