స్టాక్‌ మార్కెట్‌లో ‘ఆక్సిజన్’‌ పరుగులు...! | Oxygen Rally In Indian Stock Market | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌లో ‘ఆక్సిజన్’‌ పరుగులు...!

Apr 20 2021 3:57 PM | Updated on Apr 20 2021 5:11 PM

Oxygen Rally In Indian Stock Market - Sakshi

ముంబై: కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఆర్థిక రంగంపై మరోసారి తన ప్రభావాన్ని కచ్చితంగా చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా స్టాక్‌ మార్కెట్‌లో పలు కంపెనీల షేర్లు నేలకేసి చూస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల భయంతో స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. కోవిడ్‌ ఉధృతి, లాక్‌డౌన్‌ విధింపు చర్యలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను ప్రకటిస్తుండగా, ఇప్పటికే ముంబై, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. నిన్న ఒక్కరోజే సూచీల రెండు శాతం పతనమవ్వడంతో రూ.3.53 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయాయి. ప్రముఖ ఫార్మా కంపెనీల షేర్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

మరోవైపు స్టాక్‌ మార్కెట్‌లోని కొన్ని కంపెనీలు ఇందుకు విరుద్ధంగా లాభాలను గడిస్తున్నాయి. ఆక్సిజన్‌ను సరఫరా చేసే కంపెనీల షేర్లు ఏప్రిల్‌ మొదటి వారం నుంచి గణనీయంగా పెరిగాయి. బాంబే ఆక్సిజన్‌, నేషనల్‌ ఆక్సిజన్‌ లిమిటెడ్‌, భాగవతి ఆక్సిజన్‌ లిమిటెడ్‌ కంపెనీల షేర్లు ఏప్రిల్‌ నెలలో సుమారు 47 శాతం కంటే ఎక్కువగా లాభాలను గడించాయి. దీనికి కారణం కోవిడ్‌-19 దృష్ట్యా దేశంలో ఆక్సిజన్‌ ఉపయోగం గణనీయంగా పెరగడంతో కంపెనీల షేర్లు పెరిగాయి. కాగా దేశంలో ఆక్సిజన్‌ సిలిండర్‌ ధరలు రెట్టింపయ్యాయి.

విచిత్రమేమిటంటే కంపెనీ పేరులో ఆక్సిజన్‌ ఉన్న కంపెనీల షేర్లు అమాంతం నింగికేగిసాయి. నేషనల్‌ ఆక్సిజన్‌ లిమిటెడ్‌, భాగవతి ఆక్సిజన్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఆక్సిజన్‌, ఇతర వాయువులను ఉత్పత్తి చేస్తున్నాయి. బాంబే ఆక్సిజన్‌ లిమిటెడ్‌ ఆక్సిజన్‌ ఉ‍త్పత్తిని 2019లో నిలిపివేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ బాంబే ఆక్సిజన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గా తన పేరు మార్చింది. ఈ కంపెనీ షేర్లు ఏప్రిల్‌ నెలలో సుమారు 112 శాతం వరకు ఎగబాకాయి. కాగా కొవిడ్‌-19 తీవ్రత తగ్గిన వెంటనే కంపెనీల షేర్లు సాధారణ స్థాయికి వస్తాయని కోటక్‌ సెక్యురిటిస్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రుస్మిక్‌ ఓజా తెలిపారు.

చదవండి: మార్కెట్‌.. లాక్‌‘డౌన్‌’!

Advertisement
 
Advertisement
Advertisement