
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ తాజాగా 300 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. మే నెలలో దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపిన కొన్ని రోజుల్లోనే ఇలా మరో 300 మంది ఉద్యోగాలు కట్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఈ తొలగింపులు సంస్థ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణానికి అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపినట్లు బ్లూమ్బర్గ్ చెప్పింది. ఈ లేఆఫ్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, దీర్ఘకాలిక ప్రాధాన్యతలపై వనరులను కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.
పనితీరుతో సంబంధం లేదు..
ఇటీవల టౌన్హాల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగుల తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ లేఆఫ్స్ పనితీరుకు సంబంధించినవి కావని, వ్యూహాత్మక మార్పులో భాగంగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఏఐ మౌలిక సదుపాయాలు, దాని అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ ప్రాజెక్ట్ల్లో దాదాపు 30% కోడ్ రాయడానికి సహాయపడుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ఆటోమేషన్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్పై అధికంగా ఆధారపడడాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: లకారం దగ్గర్లో పసిడి! ఈరోజు ధరలు ఇలా..
ఉద్యోగులపై ప్రభావం
మైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించిన లేఆఫ్స్లో ఏ కేటగిరీ ఉద్యోగులను తొలగించిందో పేర్కొననప్పటికీ, మునుపటి తొలగింపులో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లను లక్ష్యంగా చేసుకున్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో ఏఐ అసిస్టెడ్ కోడింగ్ టూల్స్ను మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్ఫామ్స్తో సహా ఇతర సంస్థలు ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్గతంగా సంస్థల్లో తక్కువ మంది సిబ్బంది నియామకానికి కారణమవుతుందని సేల్స్ఫోర్స్ గత వారం తెలిపింది. మైక్రోసాఫ్ట్లో జూన్ 2024 నాటికి 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 55% మంది యూఎస్లో పనిచేస్తున్నారు.