81,000 దాటిన సెన్సెక్స్‌ | IT stocks lift sensex above 81k for 1st time | Sakshi
Sakshi News home page

81,000 దాటిన సెన్సెక్స్‌

Jul 19 2024 4:54 AM | Updated on Jul 19 2024 10:11 AM

IT stocks lift sensex above 81k for 1st time

24,800కి నిఫ్టీ

4వ రోజూ రికార్డుల ర్యాలీ 

ముంబై: దేశీయ స్టాక్‌ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. అధిక వెయిటేజీ టీసీఎస్‌(3%), ఇన్ఫోసిస్‌(2%), రిలయన్స్‌(1%), ఐసీఐసీఐ బ్యాంక్‌(1%) చొప్పున రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతలు సెపె్టంబర్‌ నుంచి ప్రారంభం కావచ్చొనే అంచనాలూ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్‌ 627 పాయింట్ల లాభంతో 81,343 వద్ద ముగిసింది. 

నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 24,801 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డులు కావడం విశేషం. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధమంతా బలహీనంగా ట్రేడయ్యాయి. మిడ్‌ సెషన్‌ నుంచి మార్కెట్‌ లాభాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్‌ 806 పాయింట్లు బలపడి 81,523 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు ఎగసి 24,838 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. 

→ ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. సెపె్టంబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్‌ పెంచాయి. ఎల్‌టీఐఎం 3.50%, టీసీఎస్‌ 3%, విప్రో 2.50%, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్, టెక్‌ మహీంద్రా 2% రాణించాయి. ఎంఫసీస్‌లు ఒకశాతం లాభపడ్డాయి.  

రూపాయి రికార్డ్‌ కనిష్టం @ 83.63 
దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 5 పైసలు నీరసించి 83.63 వద్ద ముగిసింది. రూపాయి 83.57 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 83.66 వరకూ క్షీణించింది.   

Advertisement
 
Advertisement
Advertisement