ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ బాంబులు.. ప్రపంచ మార్కెట్లు కుదేలు | Israel-Iran conflict caused volatility in global stock markets | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ బాంబులు.. ప్రపంచ మార్కెట్లు కుదేలు

Jun 14 2025 8:40 AM | Updated on Jun 14 2025 9:58 AM

Israel-Iran conflict caused volatility in global stock markets

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడితో క్రూడాయిల్‌ ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్‌ శుక్రవారం 573 పాయింట్లు పతనమై 81,119 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి 24,719 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన క్షణాల్లోనే 1,337 పాయింట్లు క్షీణించి 80,355 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు కుప్పకూలి 24,473 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. అయితే దిగువ స్థాయిలో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర తగ్గాయి. ఆసియా యూరప్‌ దేశాల స్టాక్‌ సూచీలు 1%–1.5% నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు 1.5% నష్టాలతో ట్రేడవుతున్నాయి.

  • ఫార్మా, రియల్టీ షేర్లకు మాత్రమే స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. రంగాల వారీగా బీఎస్‌ఈ ఇండెక్సుల్లో సర్వీసెస్‌ 2.06%, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, విద్యుత్‌ 1.01 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు అరశాతం నష్టపోయాయి.

  • భారత్‌కు ఎక్కువగా దిగుమతయ్యే బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరల అనూహ్య ర్యాలీతో దేశీయంగా చమురు ఆధారిత రంగాలైన ఆయిల్‌ మార్కెటింగ్, ఏవియేషన్, పెయింట్స్, అడెటివ్స్‌, టైర్స్‌ కంపెనీల షేర్లు డీలా పడ్డాయి. బీపీసీఎల్‌ 2%, ఐఓసీ 1.78%, హెచ్‌పీసీఎల్‌ 1.41% షేర్లు  నష్టపోయాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 4%, స్పైస్‌జెట్‌ 2% పతనమయ్యాయి. ట్రేడింగ్‌లో 6% కుప్పకూలాయి. ఇండిగో పెయింట్స్‌ 3%, బెర్జర్‌ పెయింట్స్‌ 0.59%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.14% నష్టపోయాయి. సియట్‌ 1.35%, అపోలో టైర్స్‌ 
    1.13 శాతం పతనమయ్యాయి.

  • ఆటోమోటివ్‌ టెక్నాలజీ సంస్థ సోనా కమ్‌స్టర్‌ కంపెనీ చైర్మన్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ జే కపూర్‌(53) అకాల మరణంతో కంపెనీ షేరు షేరు 2% నష్టపోయి రూ.502 వద్ద స్థిరపడింది. లండన్‌లో జూన్‌ 12న సంజయ్‌ గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలా

రూ.8.35 లక్షల కోట్లు ఆవిరి...

స్టాక్‌ మార్కెట్‌ వరుస పతనంతో రెండురోజుల్లో రూ.8.35 లక్షల కోట్లు హరించుకుపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొత్తం విలువ రూ.447 లక్షల కోట్లు (5.19 ట్రిలియన్‌ డాలర్లు)కు దిగివచ్చింది. గడిచిన 2 రోజుల్లో సెన్సెక్స్‌ 1,396 పాయింట్లు నష్టపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement