రిటర్నుల దాఖలుకు రెడీనా..?  | Income Tax Slabs and Rates for FY 2025-26, sakshi special story | Sakshi
Sakshi News home page

రిటర్నుల దాఖలుకు రెడీనా..? 

Jun 2 2025 5:49 AM | Updated on Jun 2 2025 5:49 AM

Income Tax Slabs and Rates for FY 2025-26, sakshi special story

ఐటీఆర్‌ పత్రాల్లో పలు మార్పులు 

సెప్టెంబర్‌ 15 వరకు అదనపు గడువు 

మూలధన లాభాలను సమగ్రంగా వెల్లడించాలి 

ఆధార్‌ ఉంటేనే రిటర్నుల సమర్పణ సాధ్యం 

డిజిటల్‌ రూపంలో ఫారమ్‌ 16 

షేర్ల బైబ్యాక్‌ ఆదాయంపై పన్ను

ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 6.47 కోట్ల నుంచి 8.39 కోట్లకు రిటర్నులు పెరిగాయి. పెరుగుతున్న అవగాహన, ఆదాయపన్ను శాఖ విస్తృత ప్రచారం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్‌మెంట్‌ సంవత్సరం 2025–26) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. వీటిల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి ఫలితంగా అదనపు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. వీటితోపాటు.. ఆదాయన్ను రిటర్నుల పత్రాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.  

ఐటీఆర్‌ 1, 4లో మార్పులు 
ఐటీఆర్‌ 1, 4 పత్రాల దాఖలుకు మరింత మందికి అర్హత లభించింది. ఈక్విటీ, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభం కలిగిన వారు సైతం వీటిని దాఖలు చేయవచ్చు. కాకపోతే మూలధన లాభం ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు మించకూడదు. ‘‘ముందు సంవత్సరాల్లో సెక్షన్‌ 112ఏ కింద దీర్ఘకాల మూలధన లాభం (ఎల్‌టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలోనే ఉన్నప్పటికీ ఐటీఆర్‌–1 ఫారమ్‌కు అర్హత ఉండేది కాదు. దీనికి బదులు ఐటీఆర్‌–2 లేదా 3 దాఖలు చేయాల్సి వచ్చేది. ఇవి మరింత సంక్లిష్టంగా ఉండడంతో అధిక సమయం పట్టేది. చిన్న పన్ను చెల్లింపుదారులకు శ్రమ తగ్గించే ఉద్దేశ్యంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) ఐటీఆర్‌–1, 4 పరంగా అర్హత ప్రమాణాలను సవరించింది. మొత్తం ఎల్‌టీసీజీ రూ.1.25 లక్షలు మించనప్పుడు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్‌ (తదుపరి సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్‌ 1, 4 దాఖలు చేసుకునేందుకు అనుమతించింది’’అని ట్యాక్స్‌మన్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌ వాద్వా తెలిపారు. ఒకవేళ దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించినా లేదా మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వారు ఇంతకుముందు మాదిరే ఐటీఆర్‌ 2 లేదా 3లో నిబంధనల ప్రకారం తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రూ.1.25 లక్షల వరకు మూలధన లాభంపై ఎలాంటి పన్ను లేకపోవడంతో ఈ వెసులుబాటు లభించింది.  

ఆధార్‌ నంబర్‌ ఉండాల్సిందే.. 
ఐటీఆర్‌ 1, 2, 3, 5 పత్రాల్లో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ కాలమ్‌ను తొలగించారు. ఇంతకుముందు వరకు ఆధార్‌ లేకపోయినా ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌తో ఐటీఆర్‌ దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. అసెస్‌మెంట్‌ సంవత్సరం (ఏవై) 2025–26 ఐటీఆర్‌లు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్‌ నంబర్‌ ఉండాల్సిందే. లేదంటే ఐటీఆర్‌ దాఖలు చేయలేరని వాద్వా తెలిపారు.   

వ్యాపారులైతే అదనపు వివరాలు 
వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం ఉన్న వారు ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మళ్లేందుకు అవకాశం లేదు. వీరు ఒక్కసారి కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే, జీవిత కాలంలో తిరిగి ఒక్కసారే పాత విధానానికి మళ్లేందుకు అనుమతిస్తారు. ‘‘గతేడాది ఐటీఆర్‌ 4 పత్రం కొత్త పన్ను విధానం నుంచి తప్పుకున్నారా? అని మాత్రమే అడిగేది. అవును అని బదులిస్తే ఫారమ్‌ 10–ఐఈఏ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ ఇవ్వాల్సి వచ్చేది. ఏవై 2025–26 ఐటీఆర్‌–4లో మాత్రం మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారమ్‌ 10–ఐఈఏ గత ఫైలింగ్‌ల ధ్రువీకరణలను సైతం సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలోనూ కొత్త పన్ను విధానం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా రా? అనే ధ్రువీకరణ సైతం ఇవ్వాలి’’అని వాద్వా తెలిపారు.  

టీడీఎస్‌ వివరాలు  
ఈ ఏడాది ఐటీఆర్‌ 1, 2, 3, 5లో టీడీఎస్‌ కాలమ్‌లో.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏ ఆదాయం నుంచి టీడీఎస్‌ మినహాయించారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం కాకుండా ఇతర ఆదాయంపై టీడీఎస్‌ మినహాయించినట్టయితే ఆ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని వాద్వా 
తెలిపారు.  

మూలధన నిబంధనల్లో మార్పులు 
2024 బడ్జెట్‌లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల నిబంధనల్లో మార్పులు చేశారు. ఇవి 2024 జూలై 23 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్‌ షేర్లు లేదా అన్‌లిస్టెడ్‌ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్, ఇల్లు, భూమి లేదా ఇతర క్యాపిటల్‌ అసెట్‌లను విక్రయించినట్టయితే.. అవి ఏ తేదీన విక్రయించారన్న దాని ఆధారంగా పన్ను బాధ్యతలను వేర్వేరుగా మదింపు వేసుకోవాలి. 2024 జూలై 23కు ముందు విక్రయించినట్టయితే ఒక రేటు, ఆ తర్వాత విక్రయించిన వారికి మరొక రేటు వర్తిస్తుంది. ఐటీఆర్‌ పత్రాల్లో 2024 జూలై 23కు ముందు, ఆ తర్వాత లావాదేవీల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ఈక్విటీ, డెట్‌ సెక్యూరిటీలపై వేర్వేరు రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. మూలధన లాభం ఉంటే ఐటీఆర్‌ 2, 3 లేదా 5లో నిబంధనల ప్రకారం తమకు సరిపోయే పత్రాన్ని దాఖలు చేయాలి.  

అన్‌లిస్టెడ్‌ బాండ్లు, డిబెంచర్లపై లాభం 
అన్‌లిస్టెడ్‌ బాండ్లు, డిబెంచర్లపై మూలధన లాభాలను ఈ ఏడాది ఐటీఆర్‌ పత్రాల్లో ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది. 2024 జూలై 23 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘‘వీటి ప్రకారం.. అన్‌లిస్టెడ్‌ డిబెంచర్లు లేదా బాండ్లు 2024 జూలై 22 లేదా అంతకుముందు ఇష్యూ చేసి ఉంటే, వాటి గడువు ముగింపు లేదా విక్రయం లేదా బదిలీ 2024 జూలై 23 లేదా ఆ తర్వాత జరిగితే.. ఆ మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం కిందే పరిగణిస్తారు. ఎంతకాలం పాటు కొనసాగించారన్న దానితో సంబంధం లేదు. ఈ ఆదాయాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 2024 జూలై 23కు ముందు ఇన్వెస్ట్‌ చేసి, ఆ లోపే విక్రయించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం కింద 20 శాతం పన్ను చెల్లించాలి’’అని వాద్వా వివరించారు. అన్‌లిస్టెడ్‌ బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడులు కలిగిన వారు ఐటీఆర్‌ 2, 3 లేదా 5 ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది.  

బైబ్యాక్‌ సైతం డివిడెండే
2024 అక్టోబర్‌ 1 నుంచి లిస్టెడ్‌ కంపెనీలు చేపట్టే షేర్ల బైబ్యాక్‌లో పాల్గొని, ఆదాయం అందుకుంటే ఆ మొత్తాన్ని డివిడెండ్‌ కిందే పరిగణిస్తారు. ‘ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌’ (ఇతర వనరుల రూపంలో వచ్చిన ఆదాయం) కింద బైబ్యాక్‌ మొత్తాన్ని డివిడెండ్‌ ఆదాయంగా చూపించాలని వాద్వా సూచించారు. ‘‘క్యాపిటల్‌ గెయిన్స్‌ షెడ్యూల్‌లో మాత్రం బైబ్యాక్‌లో షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సున్నా కింద చూపించాలి. అప్పుడు షేర్ల కొనుగోలుకు చేసిన పెట్టుబడి మొత్తం మూలధన నష్టం అవుతుంది. దీన్ని తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవాలి. తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో దీర్ఘకాల మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు’’అని వాద్వా వివరించారు.  

80డీడీ, 80యూ కోసం డిజేబిలిటీ సర్టీఫికెట్‌ 
వైకల్యంతో ఉన్న వారి కోసం చేసిన వ్యయాలను పాత పన్ను విధానంలో సెక్షన్‌ 80డీడీ లేదా సెక్షన్‌ 80యూ కింద మినహాయింపు కోరుకునే అవకాశం ఉంది. ఇందుకు గతంలో ఫారమ్‌ 10–ఐఏ వివరాలు ఇస్తే సరిపోయేది. అయితే ఈ ఏడాది నుంచి ఈ సెక్షన్ల కింద మినహాయింపు కోరేవారు ఫారమ్‌ 10–ఐఏతోపాటు (మెడికల్‌ సర్టీ ఫికెట్‌) డిజేబిలిటీ సర్టిఫికెట్‌ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ (వైకల్య సర్టిఫికెట్‌ ధ్రువీకరణ) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఐటీఆర్‌ 2 లేదా 3ని ఎంపిక చేసుకోవాలని వాద్వా సూచించారు. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) దివ్యాంగుల కోసం చేసే వైద్య వ్యయాలు లేదా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్‌ 80డీడీ కింద పన్ను మినహాయింపు కోరొచ్చు. 80యూ సెక్షన్‌ అన్నది స్వయంగా వైకల్యం ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించినది. 40 శాతం వైకల్యం ఉన్న వారు రూ.75,000, 80 శాతం వరకు వైకల్యం ఎదుర్కొనే వారు రూ.1.25 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపును ఈ రెండు విభాగాల్లోని వారు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.   

రూ.కోటిదాటితేనే అప్పుల వివరాలు.. 
ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మొ త్తం ఆదాయం రూ.50లక్షలు మించినట్టయితే ఆస్తులు, అప్పుల వివరాలను ఐటీఆర్‌లో వెల్లడించాల్చి వచ్చేది. 2025–26 అసెస్‌మెంట్‌ సంవత్సరం నుంచి మొత్తం ఆదాయం రూ.కోటి మించినప్పుడే ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాలంటూ నిబంధనల్లో మార్పులు చేశారు.  

ఎవరికి ఏ ఫారమ్‌? 
ఐటీఆర్‌–1: వేతనం లేదా పింఛను రూపంలో రూ.50లక్షలకు మించకుండా ఆదాయం, ఒక ఇంటిపై ఆదాయం కలిగిన వారు, ఇతర ఆదాయం ఉన్న వారు (లాటరీ లేదా పందేల్లో గెలుపు రూపంలో కాకుండా) ఐటీఆర్‌–1 దాఖలు చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పుల ప్రకారం దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలు మించని వారు సైతం ఇదే పత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. భారత్‌కు వెలుపల ఆస్తులు కలిగిన వారు లేదా విదేశీ ఆదాయం కలిగిన వారు ఐటీఆర్‌–1 దాఖలుకు అర్హులు కారు. అలాగే రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు, వ్యవసాయ ఆదాయం రూ.5,000 మించిన వారికీ ఐటీఆర్‌–1 వర్తించదు.  

ఐటీఆర్‌–2: వ్యక్తులు లేదా హెచ్‌యూఎఫ్‌లు రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగి.. అదే సమయంలో వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేనట్టయితే ఐటీఆర్‌–2ను ఎంపిక చేసుకోవాలి. ఇతర ఆదాయం (లాటరీలు, పందేల రూపంలో గెలుచుకున్న ఆదాయం సైతం) కలిగి ఉంటే.. స్వల్పకాల మూలధన లాభం, రూ.1.25 లక్షలకు మించి దీర్ఘకాల మూలధన లాభం, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవాలనుకుంటే, ఒకటికి మించి ఇళ్లపై ఆదాయం.. విదేశీ ఆస్తులు/ ఆదాయం.. క్రిప్టో ఆదాయం కలిగినవారు (మూలధన లాభంగా చూపించేట్టయితే), వ్యవసాయం ఆదాయం రూ.5,000 మించి ఉంటే, ఒక కంపెనీలో డైరెక్టర్‌ హోదాలో ఉంటే, అన్‌లిస్టెడ్‌ షేర్లు కలిగిన వారు సైతం ఫారమ్‌ 2ను దాఖలు చేయాల్సి ఉంటుంది.   

ఐటీఆర్‌–3: ఐటీఆర్‌–2లో పేర్కొన్న అన్ని ఆదాయాలకు అదనంగా ఒక సంస్థలో భాగస్వామిగా ఉంటే, క్రిప్టో ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా చూపిస్తుంటే ఐటీఆర్‌–3ని ఎంపిక చేసుకోవాలి. వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయం (ఆడిట్, ఆడిట్‌ అవసరం లేని కేసులు), వేతనం, అద్దె ఆదాయం, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు, వడ్డీ, డివిడెండ్‌లు, లాటరీ ఆదాయం లేదా ఇతర ఏదైనా ఆదాయం.. ఒక సంస్థలో భాగస్వామిగా ఆదాయం అందుకున్న వారికి ఇది వర్తిస్తుంది. వ్యాపారం లేదా వృత్తి నిర్వహిస్తూ ప్రిజంప్టివ్‌ ఇన్‌కమ్‌ను ఎంపిక చేసుకోని వారు, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కలిగి రికార్డులు నిర్వహిస్తూ, వాటిని ఆడిటింగ్‌ చేయాల్సి ఉన్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది.  

ఐటీఆర్‌–4: రూ.50లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, పార్ట్‌నర్‌íÙప్‌ ఫర్మ్‌లు (ఎల్‌ఎల్‌పీలు కాకుండా).. ఐటీఆర్‌–1 కిందకు వచ్చే ప్రతీ ఆదాయానికి అదనంగా.. ప్రిజంప్టివ్‌ ఇన్‌కమ్‌ (టర్నోవర్‌పై నిరీ్ణత శాతాన్ని ఆదాయంగా చూపించే) స్కీమ్‌ కింద వ్యాపారం/వృత్తి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్‌–4ను ఎంపిక చేసుకోవాలి. వ్యవసాయం ఆదాయం రూ.5,000 కు మించకుండా ఉంటేనే దీనికి అర్హత ఉంటుంది. లాటరీ, పందేల రూపంలో కాకుండా ఇతర ఆదాయం కలిగిన వారు.. వీటికి అదనంగా దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించకుండా ఉండి, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్‌ –4 దాఖలు చేయాల్సి ఉంటుంది.  

ఐటీఆర్‌–5: ఎల్‌ఎల్‌పీలు, అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్‌లు (ఏవోపీలు), బాడీ ఆఫ్‌ ఇండివిడ్యువల్స్‌ (బీవోఐలు), ఆర్టీఫీషియల్‌ జ్యురిడికల్‌ పర్సన్‌ (ఏజేపీలు)లకు ఇది వర్తిస్తుంది.  

ఐటీఆర్‌–6: సెక్షన్‌ 11 కింద మినహాయింపులు క్లెయిమ్‌ చేయని కంపెనీలు ఐటీఆర్‌–6 దాఖలు చేయాల్సి ఉంటుంది. 

ఐటీఆర్‌–7: సెక్షన్‌ 139(4ఏ), లేదా సెక్షన్‌ 139(4బి) లేదా సెక్షన్‌ 139(4సి), లేదా సెక్షన్‌ 139(4డి), లేదా సెక్షన్‌ 139(4ఈ), లేదా సెక్షన్‌ 139(4ఎఫ్‌)ల కింద ఆదాయం కలిగిన వ్యక్తులు, కంపెనీలకు ఐటీఆర్‌–7 వర్తిస్తుంది.  

డిజిటల్‌ ఫారమ్‌ 16 
ఆదాయపన్ను శాఖ కొత్తగా డిజిటల్‌ ఫారమ్‌ 16ను ప్రకటించింది. ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించిన పన్ను వివరాలు (టీడీఎస్‌) ఫారమ్‌ 16లో ఉంటాయి. సాధారణంగా ఏటా మే చివరి నాటికి ఈ పత్రాన్ని యాజమాన్యాలు ఉద్యోగులకు జారీ చేస్తుంటాయి. దీని ఆధారంగా ఉద్యోగులు రిటర్నులు దాఖలు చేస్తుంటారు. ఇకపై ట్రేసెస్‌ పోర్టల్‌ నుంచి నేరుగా ఫారమ్‌ 16 డిజిటల్‌ పత్రాన్ని జారీ చేయనున్నారు. దీంతో ఈ డిజిటల్‌ ఫారమ్‌ 16ను పన్ను రిటర్నుల దాఖలు పోర్టళ్లపై డిజిటల్‌గా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. దాంతో ఫారమ్‌ 16లో ఉన్న వివరాలన్నీ ఐటీఆర్‌లో ఆటోమేటిగ్గా భర్తీ అవుతాయి.  

ఇవి గమనించాలి.. 
→ వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, ఆడిటింగ్‌ అవసరం  లేని సంస్థలు జూలై 31 లేదా ఆలోపు ఐటీఆర్‌లు ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది ఐటీఆర్‌ పత్రాల్లో మార్పులు తీసుకొచ్చినందున ఈ గడువును సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించారు.  
→ ఆడిటింగ్‌ అవసరమైన వ్యాపార సంస్థలకు ఈ గడువు అక్టోబర్‌ 31.  
→ సవరణ రిటర్నులు దాఖలుకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఉంటుంది.  
→ రూ.5లక్షలకు మించని ఆదాయం కలిగిన వారు రూ.5వేల ఆలస్యపు రుసుం, రూ.5 లక్షలు మించిన ఆదాయం కలిగిన వారు రూ.1,000 ఆలస్యపు రుసుంతో డిసెంబర్‌ 31 వరకు బిలేటెడ్‌/లేట్‌ రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుమతి ఉంది.  
→ అప్‌డేటెడ్‌ రిటర్నులను అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు దాఖలు చేసుకోవచ్చు. ఇందుకు మార్చి 31 తుది గడువు.  

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement