ఐటీ, ఫార్మా, హెల్త్కేర్, బ్యాంకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్.. రంగమేదైనా సరే.. హైదరాబాదే టాప్ లీడర్. అవునండీ.. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ, ముంబైని దాటేసి బహుళ జాతి సంస్థలు హైదరాబాద్లో జీసీసీల ఏర్పాటుకు జై కొడుతున్నాయి. కొత్త జీసీసీల ఏర్పాటే గానీ ఇప్పటికే ఉన్న జీసీసీల విస్తీర్ణంలో గానీ భాగ్యనగరాన్నే తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయి.
అందుబాటు ధరలు, తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్య కార్మికుల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కాస్మోపాలిటన్ కల్చర్ వంటివి ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య కాలంలో దేశంలో 88 జీసీసీలు ఏర్పాటు, విస్తరణ కాగా.. ఇందులో 46 శాతం వాటాతో భాగ్యనగరం తొలి స్థానంలో నిలిచింది. మన తర్వాతే 33 శాతం వాటాతో బెంగళూరు నగరం రెండో స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది ముగింపు నాటికి రాష్ట్రంలో 120 జీసీసీలు, 1.2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
జీసీసీ - ఉమెన్
తెలంగాణలోని మొత్తం జీసీసీ నైపుణ్య కార్మికులలో 59 శాతం మంది, అంటే సుమారు 1.82 లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నారు. బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్, తయారీ రంగాల జీసీసీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. జీసీసీ నిపుణులలో మహిళలు 33 శాతం మంది ఉండగా.. 19 శాతం మంది నాయకత్వ ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. రాష్ట్రంలోని మొత్తం జీసీసీ ఉపాధిలో ఇంజనీరింగ్, ఐటీ రంగాలు 57 శాతం వాటాతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.


