400 సెంటర్లు, 3 లక్షల మంది నిపుణులు
క్వాలిజీల్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ హబ్గా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకి (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోందని ఏఐ ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజీల్ వెల్లడించింది. నగరంలో 400కు పైగా జీసీసీల్లో 3,00,000 మంది పైచిలుకు ప్రొఫెషనల్స్ ఉన్నారని వివరించింది. వీరితో పాటు దాదాపు పది లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ ప్రొఫెషనల్స్ ఉన్నట్లు ఎవరెస్ట్ గ్రూప్తో కలిసి రూపొందించిన శ్వేతపత్రంలో తెలిపింది.
2024లో 64.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీసీసీ పరిశ్రమ 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని వివరించింది. 58 శాతం సెంటర్లు ఇప్పటికే ఏజెంటిక్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. క్వాలిజీల్కి స్వయంగా హైదరాబాద్లో 3 జీసీసీలు ఉండగా, వీటిలో 850 మందికి పైగా ఇంజినీర్లు పని చేస్తున్నారు. 2028 నాటికి 100 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది.


