దేశ ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేయడం, వాణిజ్య లోటును తగ్గించడం, రూపాయి విలువను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది.
భారతదేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రజలు పెట్టుబడుల కోసం, ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా ఈ లోహాలను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే విదేశాల నుంచి ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తే దేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్తుంది. దీని వల్ల వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇది రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం మే 13న బంగారం, వెండి దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5 శాతం ఏఐడీసీ ఉంటుంది. ఇది మే 13 నుంచే అమల్లోకి వచ్చింది.
The Government of India has tightened the policy regarding the import of silver bars, changing their status from 'Free' to 'Restricted' with immediate effect. pic.twitter.com/k4Zyq4W2rO
— ANI (@ANI) May 16, 2026
తాజాగా ప్రభుత్వం వెండి దిగుమతులపై కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా 99.9 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన వెండి బార్ల దిగుమతిని ఫ్రీ నుంచి పరిమిత వర్గంలోకి మార్చింది. ఫ్రీ అంటే.. ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. పరిమిత వర్గంలో అయితే.. ప్రభుత్వ అనుమతి అవసరం అవుతుంది. దీని వల్ల వెండి దిగుమతులు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.
విదేశీ వాణిజ్యం (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1992 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో ఈ మార్పులు అమలు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశ్యం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం.


