
12 రంగాలకు వితరణ
రూ.1.76 లక్షల కోట్ల పెట్టుబడులు
రూ.16.5 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి
తయారీకి ఊతంగా 2021లో ప్రారంభం
న్యూఢిల్లీ: భారత్లో తయారీని ప్రోత్సాహించేందుకు కేంద్రం తలపెట్టిన ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 రంగాలకు రూ.21,534 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్టు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో సరఫరా వ్యవస్థ నుంచి సమస్యలు ఏర్పడడంతో.. భారత్లో తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోదీ సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని 14 రంగాల కోసం ప్రకటించింది. రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది.
ఇప్పటి వరకు 12 రంగాలకు కలిపి రూ.21,534 కోట్ల ప్రోత్సాహకం విడుదల చేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది. ఎల్రక్టానిక్స్ తయారీ, ఐటీ హార్డ్వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఆహార ప్రాసెసింగ్, వైట్ గూడ్స్ (ఏసీలు తదితర), ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, టెక్స్టైల్స్, డ్రోన్స్ తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. ఈ తరహా పథకాల పనితీరును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా సమీక్షించారు. వచ్చే ఐదేళ్ల కాలానికి పెట్టుబడులు, ప్రోత్సాహకాలతో తమ పరిధిలో కార్యాచరణ రూపొందించాలని వివిధ శాఖలను కోరారు.
12 లక్షల మందికి ఉపాధి
పీఎల్ఐ పథకం కింద ఇప్పటి వరకు రూ.1.76 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు వాణిజ్య శాఖ తెలిపింది. వీటి ద్వారా రూ.16.5 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా నమోదు కాగా, 12 లక్షల మందికి పైగా ఈ ఏడాది మార్చి నాటికి ఉపాధి (ప్రత్యక్ష, పరోక్ష) లభించినట్టు పేర్కొంది. ఫార్మా రంగానికి సంబంధించి పీఎల్ఐ పురోగతిని సమీక్షించగా, ఈ రంగంలో రూ.2.66 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా సాధ్యమైనట్టు, ఇందులో రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు మొదటి మూడేళ్లలో నమోదైనట్టు వాణిజ్య శాఖ గుర్తించింది.
మొత్తం మీద ఫార్మా రంగంలో దేశీయంగా విలువ జోడింపు 2025 మార్చి నాటికి 83.70 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. బల్క్ డ్రగ్ విభాగంలో మన దేశం నికర దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారింది. 2021–22 నాటికి నికర బల్్కడ్రగ్ దిగుమతులు రూ.1,930 కోట్లుగా ఉంటే, 2025 మార్చి నాటికి రూ.2,280 కోట్ల నికర ఎగుమతులు పీఎల్ఐ కింద నమోదయ్యాయి. మ్యాన్ మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) టెక్స్టైల్స్ ఎగుమతులు 6 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి ఎగుమతులు 5.7 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం.