పసిడి బాటలోనే వెండి ధరల తగ్గుముఖం
లాభాల స్వీకరణతో దిగివచ్చిన పసిడి
ముంబై : గత కొద్దిరోజులుగా ఒడిదుడుకులకు లోనైన బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా దిగివచ్చాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీపై స్పష్టత కొరవడటం పసిడి ధరల పతనానికి దారితీసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్లోనూ యల్లోమెటల్ ధరలు దిగివచ్చాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 805 రూపాయలు తగ్గి 50,910 రూపాయలకు దిగిరాగా, కిలో వెండి ఏకంగా 2151 రూపాయలు పతనమై 65,726 రూపాయలు పలికింది. చదవండి : బంగారం ధర పైపైకి..
యూరప్లో పలు దేశాల్లో కఠిన నియంత్రణలను ప్రకటించడంతో బంగారం ధరలు మరింత పడిపోకుండా నిలువరించాయని బులియన్ నిపుణులు వ్యాఖ్యానించారు. పసిడి ధరలు మరికొన్ని రోజులు ఒడిదుడుకులతో సాగుతాయని వారు అంచనా వేశారు. ఇక యూఎస్ ఫెడ్ చీఫ్ జెరోం పావెల్ త్వరలో అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధుల కమిటీ ఎదుట మాట్లాడనుండటంతో ఆయన ప్రకటనపై పసిడి ధరల తదుపరి దిశ ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.