పండుగల్లో తారాజువ్వలా ఈ కామర్స్‌ విక్రయాలు | E-comm festive season sales grew 25percent YoY to Rs 76,000 cr | Sakshi
Sakshi News home page

పండుగల్లో తారాజువ్వలా ఈ కామర్స్‌ విక్రయాలు

Nov 19 2022 6:28 AM | Updated on Nov 19 2022 6:28 AM

E-comm festive season sales grew 25percent YoY to Rs 76,000 cr - Sakshi

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో (అక్టోబర్‌లో) ఈ కామర్స్‌ సంస్థ అమ్మకాలు జోరుగా సాగాయి. కస్టమర్ల డిమాండ్‌తో అమ్మకాల్లో 25 శాతం వృద్ధిని చూశాయి. రూ.76,000 కోట్ల అమ్మకాలు నమోదైనట్టు మార్కెట్‌ పరిశోధనా సంస్థ రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ వెల్లడించింది. పండుగల సీజన్‌ తొలి వారానికి తాము వేసిన అంచనాలకు అనుగుణంగానే ఈ కామర్స్‌ కంపెనీల విక్రయాలున్నట్టు రెడ్‌సీర్‌ పార్ట్‌నర్‌ ఉజ్వల్‌ చౌదరి చెప్పారు. ‘‘రూ.83,000 కోట్ల అమ్మకాలు ఉంటాయని మేము అంచనా వేశాం. చివరికి గ్రాస్‌ మర్చండైజ్‌ వ్యాల్యూ (విక్రయించిన ఉత్పత్తుల విలువ) రూ.76,000 కోట్లుగా నమోదైంది.

మా తొలి అంచనాల కంటే 8–9 శాతం తక్కువ. అయినప్పటికీ ఈ మొత్తం కూడా చెప్పుకోతగ్గ గరిష్ట స్థాయి. గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే 25 శాతం అధికం’’అని ఉజ్వల్‌ చౌదరి వివరించారు. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు (మింత్రా, షాప్సీ సహా) రూ.40వేల కోట్ల విక్రయాలతో 62 శాతం వాటా ఆక్రమించినట్టు రెడ్‌సీర్‌ నివేదిక తెలిపింది. ఆ తర్వాత అమెజాన్‌ వాటా 26 శాతంగా ఉంది. ఫ్యాషన్‌ ఉత్పత్తులు 32 శాతం, మొబైల్‌ ఫోన్లు 7 శాతం, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు (గృహోపకరణలు సహా) 13 శాతం, ఇతర విభాగాల్లో అమ్మకాలు 86 శాతం చొప్పున పెరిగాయి. మొబైల్‌ ఫోన్లు అధిక మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement