
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ ఆదేశాలు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న పసిడి రుణాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుండటంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇలాంటి పలు ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, ఈ నేపథ్యంలో బంగారం రుణాల పోర్ట్ఫోలియోను సమగ్రంగా సమీక్షించుకోవాలని పీఎస్యూ బ్యాంకులన్నింటికీ సూచించింది.
ఈ మేరకు బ్యాంకుల చీఫ్లకు లేఖ రాసినట్లు ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. బంగారం రుణాలపై ఫీజులు.. వడ్డీల వసూళ్లు.. ఖాతాల మూసివేతలో అవకతవకలు జరుగుతుండటం, తగినంత విలువ గల బంగారాన్ని తనఖా పెట్టించుకోకుండానే రుణాలివ్వడం, నగదు రూపంలో రీపేమెంట్లు తీసుకోవడం తదితర ఉల్లంఘనలపై డీఎఫ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 31 వరకు మంజూరైన రుణాలపై సమీక్ష జరగనుంది.