ఏపీలో రూ.350 కోట్లతో ఆర్జాస్‌ స్టీల్‌ విస్తరణ | Arjas Steel To Expand Production Capacity Plants In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో రూ.350 కోట్లతో ఆర్జాస్‌ స్టీల్‌ విస్తరణ

Dec 15 2022 9:01 AM | Updated on Dec 15 2022 9:01 AM

Arjas Steel To Expand Production Capacity Plants In Andhra Pradesh - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టీల్‌ రంగంలో ఉన్న ఆర్జాస్‌ స్టీల్‌ (గతంలో జెర్డావ్‌ స్టీల్‌) రెండు ప్లాంట్లను విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్లాంటు సామర్థ్యాన్ని 25–30 శాతం పెంచుతోంది. ఇందుకోసం రూ.350 కోట్లు పెట్టుబడి చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులు. నాణ్యతను మెరుగుపరిచేందుకు జర్మనీ నుంచి కాక్స్‌ సైజింగ్‌ బ్లాక్‌తోపాటు కాయిల్‌ రూపంలో ప్రత్యేక స్టీల్‌ ఉత్పత్తికై గ్యారెట్‌ కాయిలర్‌ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

కొత్త స్టవ్‌ల స్థాపనతోసహా స్టీల్‌ శుద్ధి సామర్థ్యం పెంచుతున్నారు. అలాగే పంజాబ్‌లోని మండి గోవింద్‌ఘర్‌ ప్లాంటు వార్షిక సామర్థ్యం ప్రస్తుతం ఒక లక్ష టన్నులు. దీనికి రూ.260 కోట్ల వ్యయంతో 60–70 శాతం సామర్థ్యం జోడిస్తున్నారు. మొత్తం ఈ రెండు ప్లాంట్లకుగాను రూ.610 కోట్ల పెట్టుబడి చేస్తుండగా.. సామర్థ్యం 5.5 లక్షల టన్నులకు చేరనుంది. 2025 నాటికి ఈ విస్తరణ పూర్తి అవుతుందని ఆర్జాస్‌ స్టీల్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తి వెల్లడించారు. వాహన రంగానికి అవసరమైన ప్రత్యేక స్టీల్‌ రెండు ప్లాంట్లలోనూ తయారవుతోంది. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్‌ వంటి కంపెనీలకు వీటిని కంపెనీ సరఫరా చేస్తోంది.

చదవండి: యాహూ.. అంబులెన్స్‌ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా!


 

Advertisement
 
Advertisement
Advertisement