మేనేజర్లకు కాలం చెల్లిందా? | AI Revolution Redefines Managers Work or Step Aside Mega Manager Era | Sakshi
Sakshi News home page

మేనేజర్లకు కాలం చెల్లిందా?

May 7 2026 12:01 PM | Updated on May 7 2026 1:05 PM

AI Revolution Redefines Managers Work or Step Aside Mega Manager Era

టెక్ ప్రపంచంలో ఇప్పుడు వినిపిస్తోన్న ఒకే మంత్రం ‘పని చేయండి లేదా పక్కకు తప్పుకోండి’. ఒకప్పుడు కేవలం పర్యవేక్షణకే పరిమితమైన మేనేజర్ల పాత్ర ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కృత్రిమ మేధ ఉత్పాదకతను విప్లవాత్మకంగా మారుస్తున్న తరుణంలో ఐటీ, టెక్ దిగ్గజాలు తమ సంస్థాగత నిర్మాణాన్ని సమూలంగా మారుస్తున్నాయి. కాయిన్‌బేస్, బ్లాక్, స్నాప్ వంటి సంస్థల్లో జరుగుతున్న తాజా పరిణామాలు ఈ మార్పుకు సాక్ష్యాలు.

కాయిన్‌బేస్ సంచలనం

ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ కాయిన్‌బేస్ ఇటీవల తన ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో 14% (సుమారు 700 మంది) ఉద్యోగులను తొలగించింది. అయితే, ఈ తొలగింపుల వెనుక ఉన్న కారణం ఖర్చుల తగ్గింపుతోపాటు సంస్థను ఏఐ-ఆధారితంగా మార్చడమేనని ఆ సంస్థ సీఈఓ బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్ మేనేజర్ల భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. ‘కాయిన్‌బేస్‌లో ప్రతి నాయకుడు కూడా ఒక బలమైన వ్యక్తిగత కంట్రిబ్యూటర్ అయి ఉండాలి. మేనేజర్లు కేవలం పక్కన నిలబడి సూచనలిచ్చే వారు కాదు. వారు ప్లేయర్-కోచ్‌లా ఉండాలి. అంటే, జట్టును నడిపిస్తూనే స్వయంగా పనిలో తలమునకలు కావాలి’ అన్నారు.

క్యూ కట్టిన టెక్ దిగ్గజాలు

బ్లాక్ (Block): కంపెనీ సీఈఓ జాక్ డోర్సే ఇప్పటికే 40% సిబ్బంది కోతను ప్రకటించారు. మేనేజర్లను ప్లేయర్-కోచ్‌లుగా మారాలంటున్నారు.

స్నాప్ (Snap): కంపెనీ చీఫ్‌ ఇవాన్ స్పీగెల్ ఏఐ ఆధారిత చిన్న ‘స్క్వాడ్స్’ ఏర్పాటులో భాగంగా 1,000 ఉద్యోగాలను తొలగించారు.

మెటా, అట్లాసియన్: మార్క్ జుకర్‌బర్గ్ వంటి నాయకులు సైతం ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ’ పేరుతో మేనేజర్ల సంఖ్యను తగ్గించి సంస్థను పునర్నిర్మించే ప్రక్రియలో ఉన్నారు.

పేపాల్ (PayPal): ఏఐ పరివర్తన ద్వారా రాబోయే రెండేళ్లలో 1.5 బిలియన్ల డాలర్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 20% సిబ్బంది తగ్గింపు జరిగే అవకాశం ఉందని సమాచారం.

అలాంటివారికి కష్టమే..

హ్యూమన్ రిసోర్స్ విశ్లేషకుడు జోష్ బెర్సిన్ అభిప్రాయం ప్రకారం, పారిశ్రామిక విప్లవం నాటి ‘పర్యవేక్షణ మాత్రమే చేసే మేనేజర్’ పాత్రకు ఇక ముగింపు పలకాల్సిందే. ‘2026 నాటికి మేనేజర్‌గా కొనసాగాలంటే, మీరు కేవలం మనుషులను మాత్రమే కాదు, ఏఐ ఏజెంట్లను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఒక మేనేజర్ కంటే ఏఐ ఏజెంట్‌కే ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి, నాయకులు స్వయంగా ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలి’ అని ఆయన విశ్లేషించారు. దీనినే ఇప్పుడు మెగామేనేజర్ సంస్కృతిగా పిలుస్తున్నారు.

నైపుణ్యం లేకపోతే నిష్క్రమణే!

క్రిప్టోజాబ్స్ లిస్ట్ వ్యవస్థాపకుడు రామన్ షాలుపౌ మాటల్లో చెప్పాలంటే, ఇది ఒక అనివార్యమైన మార్పు. కంపెనీలు ఏఐ వాషింగ్ (అత్యాధునికంగా కనిపించే ప్రయత్నం) చేస్తున్నాయా లేదా నిజంగా ఉత్పాదకత పెరుగుతోందా అనేది పక్కన పెడితే, ఉద్యోగంలో కొనసాగాలంటే ఏఐ నైపుణ్యాలు కలిగి ఉండటం ఇప్పుడు తప్పనిసరి.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement