నామమాత్రపు తనిఖీలేనా..?
● భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్కు.. ● తాజాగా పట్టుబడిన 350 క్వింటాళ్ల బియ్యం ● నామమాత్రపు తనిఖీలతో సరి
భద్రాచలంటౌన్: నిరుపేదలకు ఉచితంగా అందించే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్ బియ్యం అక్రమార్కులకు వరంలా మారింది. ఈ అక్రమ దందా భద్రాచలం కేంద్రంగా సాగుతున్న తెలంగాణ సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్ వరకు చేరుతోంది. తాజాగా భద్రాచలం సమీపంలో ఛత్తీస్గఢ్కు వెళ్తున్న లారీలో 350 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడగా.. స్థానిక అధికార యంత్రాంగం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడంతో కొందరు దళారులు రేషన్ దుకాణాల వద్దనే కిలోకు రూ.8 చొప్పున లబ్ధిదారుల వద్ద బియ్యాన్ని కొంటున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ తదితర సరిహద్దు జిల్లాల నుంచి బైక్లు, ఆటోలు, చిన్న వాహనాల ద్వారా సేకరించిన బియ్యాన్ని రహస్య గోదాములకు తరలించి, అక్కడ సంచులు మార్చి అర్ధరాత్రి వేళల్లో లారీల ద్వారా ఛత్తీస్గఢ్కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
స్థానిక సివిల్ సప్లై అధికారుల తనిఖీలు లేకపోవడంతో చెక్పోస్టులు, రేషన్ దుకాణాలు, నిల్వ కేంద్రాలను దాటుకుని రోజూ వందల క్వింటాళ్ల బియ్యం తరలుతున్నట్లు సమాచారం. అప్పుడప్పుడు వాహనాలు పట్టుబడి కేసులు నమోదవుతున్నా.. సంబంధిత దళారులు, నిర్వాహకులపై చర్యలు కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర స్థాయి సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగినప్పుడే భారీ అక్రమ రవాణా వెలుగులోకి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈక్రమాన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డీటీఐ రాజులు హెచ్చరించారు.


