అశ్వారావుపేటరూరల్: తక్కువవడ్డీకే బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది గిరిజన మహిళలను మోసం చేసిన ఇద్దరిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అదనపు ఎస్ఐ దేవ్సింగ్ కథనం ప్రకారం.. మండలంలోని కేశప్పగూడేనికి చెందిన సోడెం రాధ, ముదిగొండ శేషు అనే వ్యక్తితో గతకొంతకాలంగా నారంవారిగూడెం కాలనీలో నివాసం ఉంటూ.. సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఇదే మండలంలోని వాగొడ్డుగూడేనికి చెందిన 16 మంది గిరిజన మహిళలకు ఒకొక్కరికి రూ.50వేలను తక్కువ వడ్డీతో బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించారు. ఆ తర్వాత లబ్ధిదారుల వాటా కింద ముందుగా ఒక్కొక్కరి వద్ద రూ.5వేలు చొప్పున మొత్తం రూ.80వేలు వసూలు చేసి కనిపించకుండా పోయారు. దీంతో మోసపోయిన బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించగా.. బాధితురాలు కొత్తపల్లి మంగమ్మ ఫిర్యాదుతో రాధ, శేషులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్ఐ తెలిపారు.
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
ఖమ్మంరూరల్: ఖమ్మంరూరల్ మండలంలోని పొన్నెకల్లు స్టేజీ సమీపాన ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తల్లంపాడు గ్రామానికి చెందిన షేక్ మోసిన్(17), ఎస్.కే.జహీర్ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం వైపు బయలుదేరారు. పొన్నెకల్లు స్టేజీ సమీపాన వాహనం అదుపు తప్పగా కింద పడిన మోసిన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, జహీర్కు చేయి విరగడంతో పాటు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.


