ఇక పత్తి ‘ప్రైవేటు’కే..
నేటితో ముగియనున్న సీసీఐ కొనుగోళ్లు
ఇదే అదునుగా
వ్యాపారులు ధర తగ్గించే అవకాశం
కూలీల కొరతతో
ఆలస్యమవుతున్న పత్తితీతలు
కూలీల కొరతతో..
ముందే ప్రకటించింది..
బూర్గంపాడు: ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి పంట ఆలస్యంగా రైతుల చేతికి వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పత్తితీతలు చివరి దశకు చేరుకున్నాయి. కూలీల కొరత కారణంగా మార్చి వరకు పత్తి తీయించుకోవాల్సిన పరిస్థితులున్నాయి. ఈ తరుణంలో ఫిబ్రవరి 20(శుక్రవారం) నుంచి పత్తి కొనుగోళ్లు చేస్తున్నట్లు సీసీఐ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందతున్నారు. చేలల్లో ఉన్న పత్తిని ఎలా అమ్ముకోవాలని మదనపడుతున్నారు.
ఈసారి నెలరోజులు ముందే..
ఈ ఏడాది జిల్లాలో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అధిక వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఎకరాకు సరాసరి 6 క్వింటాళ్ల దిగుబడులే వచ్చాయని రైతులు వాపోతున్నారు. తొలుత తీసిన పత్తి నాణ్యత లేదని, తేమశాతం ఎక్కువగా ఉందని తక్కువ ధరలకు అమ్ముకున్నారు. రెండో, మూడో విడతల్లో తీసిన పత్తిని సీసీఐలో అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధర పొందుతున్నారు. జిల్లాలో ఆరు జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గురువారం వరకు 10,781 మంది రైతుల నుంచి 2.98 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటా పత్తికి రూ 8,110 నుంచి రూ.7,950ల వరకు సీసీఐ మద్దతు ధర చెల్లించింది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం తెచ్చిన కిసాన్ కపాస్ యాప్ విధానం కొందరు రైతులకు ఇబ్బందికరంగా మారింది. సీసీఐ గతేడాది మార్చి మూడో వారం వరకు కొనుగోళ్లు జరపగా, ప్రస్తుతం పత్తి నాణ్యత సరిగా లేదంటూ ఈసారి నెలరోజులు ముందే కొనుగోళ్లకు బ్రేకులు వేసింది.
రైతుల్లో ఆందోళన
అధిక వర్షాల కారణంగా తొలుత కాసిన పత్తి కాయలు కుళ్లి, నాణ్యమైన దిగుబడులు రాలేదు. దీంతో క్వింటా రూ. 4వేల నుంచి రూ. 5వేలకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. నవంబర్లో వర్షాలు తగ్గాక సస్యరక్షణకు వేల రూపాయలు ఖర్చుచేసి పురుగుమందులు స్ప్రే చేశారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పత్తిచేలు ఓ మాదిరి కాపుకాశాయి. గ్రామాల్లో కూలీల కొరతతో పక్క మండలాల నుంచి తీసుకువస్తున్నారు. కొందరు ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం ప్రాంతం నుంచి కూడా తీసుకువచ్చి పత్తిని తీయిస్తున్నారు. దీంతో వారికి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ తరుణంలో సీసీఐ పత్తి కొనుగోలు నిలిపివేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఇళ్లవద్ద, చేలలో ఇంకా 25శాతం మేర పత్తి విక్రయానికి ఉంది. సీసీఐ కొనుగోలు కేంద్రాలు మూతబడితే ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధర చెల్లించే అవకాశం ఉంది. దీంతో రైతులు నష్టపోనున్నారు. మార్చి మొదటివారం వరకై నా సీసీఐ కొనుగోళ్లు జరపాలని కోరుతున్నారు.
కూలీలు దొరకక పత్తితీతలు ఆలస్యమవుతున్నాయి. గతేడాది కిలో పత్తితీస్తే రూ.13 చెల్లించాం. ఈ ఏడాది రూ.20 ఇస్తామన్న కూలీలు దొరకటం లేదు. సీసీఐ లేకపోతే ప్రైవేటోళ్లు సగానికి సగం తక్కువ ధర పత్తిని అడుగుతారు. మరో 20 రోజులైనా కొనుగోళ్లు జరపాలి.
–ఆవుల వెంకటేశ్వరరెడ్డి, రైతు, రెడ్డిపాలెం
ఫిబ్రవరి 20న పత్తి కొనుగోలు కేంద్రాలను మూసేస్తామని సీసీఐ 20 రోజులు ముందుగానే ప్రకటించింది. పత్తి నాణ్యత లేకపోవటంతో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు కూడా క్వింటాల్కు రూ. 8 వేలు చెల్లిస్తున్నారు.
–నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి
ఇక పత్తి ‘ప్రైవేటు’కే..


