ఇరిగేషన్ ఇన్చార్జి సీఈగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్
పాల్వంచరూరల్: జలవనరులశాఖ జిల్లా చీఫ్ ఇంజనీర్గా ఎస్.శ్రీనివాసరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహించిన సీఈ గతేడాది సెప్టెంబర్లో ఉద్యోగ విరమణ పొందాడు. అప్పటి నుంచి ఇన్చార్జి బాధ్యతలను ప్రభుత్వం వరంగల్ జిల్లా ఇరిగేషన్ శాఖ సీఈ సుధీర్కు అప్పగించింది. రెండు చోట్ల బాధ్యతలు నిర్వర్తించడం వల్ల శాఖాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రెండు రోజుల క్రితం ఇరిగేషన్శాఖలో ఎస్ఈగా పనిచేస్తున్న ఎస్.శ్రీనివాసరెడ్డిని ఇన్చార్జిగా కేటాయించగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఇసుక లారీల రవాణాపై సీఈ ఆగ్రహం
పాల్వంచరూరల్: సీతారామ ప్రాజెక్ట్ కాలువల పక్క నుంచి ఇసుక లారీల రవాణాపై ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లారీలు నిత్యం అక్రమంగా రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కాలువ కట్టకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ సాక్షిలో ‘నిబంధనలకు నీళ్లు’ శీర్షికన గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఇసుక లారీల రవాణాపై ఆరా తీశారు. అనుమతులు లేకపోయినా ఇసుక లారీలు తిరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఎస్ఐ నర్సింహులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇసుక లారీలు కాలువల కట్టలు, రోడ్లు మీదుగా రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటి నుంచి లారీల రాకపోకలను అడ్డుకుంటామని తెలిపారు.
పెద్దమ్మగుడి వద్ద వ్యక్తి అదృశ్యం
పాల్వంచరూరల్: పెద్దమ్మగుడి వద్ద ఉంటున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా ఇబ్రహీంపేటకు చెందిన కాకర్ల నాగేశ్వరరావు(40) ఐదేళ్లుగా పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ఉంటూ రోజూవారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కేశవాపురం గ్రామానికి చెందిన హన్మంతు అనే వ్యక్తితో చనువుగా ఉండేవాడని, గత నెల 2వ తేదీ నుంచి కన్పించడంలేదని నాగేశ్వరరావు సోదరుడు కాకర్ల రమణయ్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.
ఇరిగేషన్ ఇన్చార్జి సీఈగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్


