సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన
టేకులపల్లి: మండలంలోని ముత్యాలంపాడు క్రాస్రోడ్ రైతు వేదికలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం (సీఐపీఎంజీ) ఆధ్వర్యంలో సస్యరక్షణ చర్యలపై గురువారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి, మొక్కజొన్న తదితర పంటల్లో సమగ్ర సస్యరక్షణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్చార్జి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ పొలంబడి, ర్యాపిడ్ రోవింగ్ సర్వే, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రబ్యూషన్ ఆఫ్ బయో పెస్టిసైడ్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్పై శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇతర అధికారులు ఉదయ శంకర్, హోపన్న గౌడ, బాబూరావు, అన్నపూర్ణ, మంగీలాల్, శ్రావణి, రమేష్, భాగ్యశ్రీ, విశాల, రెహానా పాల్గొన్నారు.
సరిహద్దు గ్రామాల్లో సోదాలు
చర్ల: తెలంగాణా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలకు చెందిన డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్లో తప్పించుకున్న మావోయిస్టులు తెలంగాణాకు వచ్చే అవకాశం ఉందనే అనుమానంతో చర్ల మండలంలోని ఉంజుపల్లి రోడ్, కుర్నపల్లి రోడ్, సుబ్బంపేట తదితర ప్రాంతాల్లో సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ తనిఖీలు చేపట్టారు.
కేఓసీలో విజిలెన్స్ తనిఖీలు?
టేకులపల్లి: కోయగూడెం ఓసీలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. కోయగూడెం ఓసీ అధికారుల నిర్లక్ష్యంతో కేఓసీలోని వే బ్రిడ్జి తూకంలో తేడాల వల్ల సింగరేణికి రోజూ 100 నుంచి 150 టన్నుల బొగ్గు నష్టం వాటిల్లుతోందని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో బుధవారం ఇల్లెందు ఏరియా అధికారులు కేఓసీలోని వే బ్రిడ్జిని సందర్శించి కాటా రాళ్లను ఉంచి తనిఖీ చేసిన విషయం విదితమే. గురువారం విజిలెన్స్, సింగరేణి సెక్యూరిటీ అధికారులు కూడా కేఓసీలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. వే బ్రిడ్జి వద్ద పరిశీలించి సంబంధిత శాఖాధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, విచారణ వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.


