హత్య కేసులో నిందితుడి అరెస్ట్..
అశ్వాపురం: మండలంలోని చవిటిగూడెంలో ఈ నెల 6న భాతిక విజయ్ను కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడైన అతడి సోదరుడు బాతిక అరుణ్ను ఆదివారం సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ క్రైమ్ కేసులో ఖమ్మం వాసులు
● అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు
రఘునాథపాలెం: సైబర్ నేరానికి సంబంధించిన కేసులో జిల్లాకు చెందిన ఇద్దరిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిన్నెవేలీ జిల్లా కేంద్రానికి చెందిన వృద్ధుడు జి.రంగనాథన్కు ముంబై పోలీసుల పేరిట ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరించడమే కాక రూ.15 లక్షలు వసూలు చేయడంతో తమిళనాడులో కేసు నమోదైంది. ఈమేరకు దర్యాప్తులో రఘునాథపాలెం మండలం వీవీ.పాలెం గ్రామానికి చెందిన తగరం శ్రీనివాస్, ఆయన కుమారుడు సాయి సిద్ధార్థ ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు తేలగా తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన సీఐ అనిత ఆధ్వర్యాన ఇద్దరు ఎస్ఐలు, ఐదుగురు సిబ్బంది శనివారం ఖమ్మం వచ్చారు. ఈమేరకు రఘునాథపాలెం పోలీసుల సహకారంతో ఆదివారం తెల్లవారుజామున తండ్రీకుమారులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి తమిళనాడు తీసుకెళ్లారు. పోలీసుల ప్రాథమిక విచారణలో డిసెంబర్ 27న రంగనాథన్ను బెదిరించగా, అదే నెల 30న ఆయన ఖాతా నుంచి నగదు శ్రీనివాస్, సాయిసిద్ధార్థ ఖాతాకు బదిలీ అయినట్లు తేలింది. అంతేకాక వారి ఖాతాల్లో సుమారు రూ.కోటి మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించారని సమాచారం. ఈ కేసులో మరికొందరి పాత్రపైనా విచారణ కొనసాగుతున్నట్లు తెలిసింది. కాగా, తమిళనాడు నుండి వచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు తమ సహకారం కోరారని, తండ్రీకుమారులను కోర్టులో హాజరుపరిచాక తమిళనాడు తీసుకెళ్లారని రఘునాథపాలెం సీఐ ఉస్మాన్షరీఫ్ ధ్రువీకరించారు.


