తెల్లంకు ‘హస్తం’ బాధ్యతలు
మున్సిపాలిటీ కో ఆర్డినేటర్లు
● భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు ● మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లెందు కోఆర్డినేటర్గా నియమించిన కాంగ్రెస్ ● ఇప్పటికే కొత్తగూడెంలో అధికార పార్టీ ప్రచారంలో పాల్గొన్న తెల్లం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకున్న విచిత్రాల్లో ఒకటి జిల్లాలో నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం వెంకట్రావుకు ఇల్లెందు మున్సిపల్ సమన్వయకర్త బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు సమన్వయకర్తలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ గురువారం నియమించారు. అందులో భాగంగా ఇల్లెందు కోఆర్డినేటర్గా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేరు ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2023లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి కారు గుర్తుపై తెల్లం వెంకట్రావు గెలిచారు. ఆ తర్వాత కొంత కాలానికి అభివృద్ధి నినాదం పేరుతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సఖ్యతగా ఉంటూ వచ్చారు. దీంతో తెల్లం కాంగ్రెస్లో చేరారంటూ అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేయడంతోపాటు బీఆర్ఎస్ న్యాయపోరాటం చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం తెల్లం కాంగ్రెస్లో చేరినట్టు ఆధారాలు లేవని, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలోనూ..
కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కాగా, బుధవారం పాతకొత్తగూడెం, బూడిదగడ్డ బస్తీల్లో విస్తరించిన పలు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారంలో తెల్లం పాల్గొనడం చర్చకు దారి తీసింది. అయితే, ఈ ప్రచారంలో తెల్లం కాంగ్రెస్, సీసీఎం కండువాలు కప్పుకోకుండా జాగ్రత్త పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం ప్రచారం చేయడమేంటనే చర్చ సమసి పోకముందే, ఏకంగా ఇల్లెందు కోఆర్డినేటర్గా నియమిస్తూ పీసీపీ అధ్యక్షుడి నుంచి ఆదేశాలు రావడం గమనార్హం. గురువారం పీసీసీ నియమించిన కోఆర్డినేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇల్లెందు తెల్లం వెంకట్రావు
అశ్వారావుపేట నాగండ్ల దీపక్ చౌదరి
కొత్తగూడెం కార్పొరేషన్ తుళ్లూరి బ్రహ్మయ్య,
బాలసాని లక్ష్మీనారాయణ,
జగదీశ్వర్రావు
తెల్లంకు ‘హస్తం’ బాధ్యతలు


