సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం
సూపర్బజార్(కొత్తగూడెం): మహనీయులు ప్రతిపాదించిన ఆశయాలు, సిద్ధాంతాలే సామాజిక న్యాయం సాధించేందుకు మార్గదర్శకాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్, మహాత్మా జ్యోతిబావ్ పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమానత్వం సాధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో కీలకమని, అధికారులు కూడా ఈ మేరకు పని చేయాలని అన్నారు. కులసర్వే నిర్వహణతో పాటు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ దిశగా తీసుకున్న నిర్ణయాలు వెనుకబడిన వర్గాల వారి ఆత్మగౌరవానికి దోహదం చేస్తాయన్నారు. అనంతరం.. వివక్ష లేకుండా ప్రతీ వ్యక్తిని గౌరవిస్తామని, సమానత్వం, న్యాయం, గౌరవం కోసం నిలబడతామని, ఏ రూపంలోనైనా అన్యాయాన్ని సమర్థించబోమని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ సూత్రాలను పరిరక్షిస్తూ, న్యాయమైన, సామరస్యపూర్వకమైన సాధికారత కలిగిన తెలంగాణ రాష్ట్రం, భారతదేశ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అనంత రామకృష్ణ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు, డీసీఓ ఎ. శ్రీనివాస్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీలత, పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఎస్.త్రినాథ్బాబు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వేణుగోపాల్


