
ఆఫ్టైప్ ఆయిల్పామ్ మొక్కల పరిశీలన
అశ్వారావుపేటరూరల్/ములకలపల్లి: ఆఫ్టైప్ మొక్కలు ఉన్న ఆయిల్పామ్ తోటలను రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అశ్వారావుపేట మండలం గంగారం, వాగొడ్డుగూడెం గ్రామాలు, ములకలపల్లి మండలం తిమ్మంపేట, పొగళ్లపల్లి గ్రామాల్లోని పామాయిల్ తోటల్లో ఉన్న ఆఫ్టైప్ మొక్కలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నర్సరీ నుంచి 2017–2022 మధ్య కాలంలో రైతులకు అందించిన ఆయిల్ పామ్ మొక్కల్లోనే ఆఫ్టైప్ మొక్కలు అత్యధికంగా ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. బాధిత రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే క్షేత్ర సందర్శన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రిటైర్డ్ ఐఐఓపీఆర్ అధికారి బీఎన్రావు మాట్లాడుతూ నర్సరీ దశలో చీడపీడలు సోకినా, పెంపకంలో నాణ్యతాలోపాలు ఉన్నా అనారోగ్యమైన మొక్కలు పెరిగే అవకాశం ఉంటుందని, వీటిని సకాలంలో గుర్తించి కల్లింగ్ చేయాల్సిందని వివరించారు. కానీ కల్లింగ్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని తెలుస్తోందని తెలిపారు. డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, అధికారులు శంకర్, రాధా కృష్ణ, నాగబాబు, కల్యాణ్ పాల్గొన్నారు.