విద్యార్థి మృతిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి మృతిపై కేసు నమోదు

Apr 21 2025 12:30 AM | Updated on Apr 21 2025 12:30 AM

విద్యార్థి మృతిపై కేసు నమోదు

విద్యార్థి మృతిపై కేసు నమోదు

పాల్వంచరూరల్‌: ఫోన్‌చూడొద్దని చెప్పినందుకు మనస్థాపంలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బొల్లారంలో నివాసముంటున్న బందెల రాముకు ఇద్దరు కుమారులు కాగా, చిన్నకుమారుడైన శ్రీరామ్‌(17) శనివారం కాలనీ శివారులో ఊరివేసుకుని మృతిచెందాడు. ఇతడు పాల్వంచ పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌ కాలనీకి చెందిన బంధువు ఇంట్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 18న ఇంట్లోనే ఫోన్‌లో గేమ్‌ అడుతున్న శ్రీరామ్‌ను అమ్మమ్మ ఫోన్‌ చూడొద్దు, గేమ్‌ ఆడొద్దని మందలించింది. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారిని మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పట్టణ ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

యువతిని వేధించిన యువకుడిపై..

కొత్తగూడెంటౌన్‌: కొత్తగూడెం పట్టణానికి చెందిన యువతిని అసభ్యకరంగా సోషల్‌మీడియా వేదికగా వేధించిన ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన యువకుడు రాహుల్‌పై ఆదివారం కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ యువతి సుజాతనగర్‌ మండలంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుకుంది. ఆ సమయాన ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడుగు గ్రామానికి బి.రాహుల్‌తో పరిచయం ఏర్పడి అతడి వద్ద కొంత డబ్బులు అప్పుగా తీసుకుంది. తిరిగి కొంత కాలానికి డబ్బులు తిరిగి ఇచ్చినా ఇవ్వలేదని చెప్పి తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధింపులకు గురి చేశాడని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు విషయాన్ని యువకుడి తల్లిదండ్రులకు చెప్పి మళ్లీ అమ్మాయి జోలికి రావొద్దని మందలించారు. అయినా సదరు యువతి స్నేహితుల ద్వారా సోషల్‌ మీడియాలో యువతి పేరుతో నకిలీ ఇన్‌స్ట్రాగాం అకౌంట్‌ క్రియేట్‌ చేసి ఆమె బంధువులు, స్నేహితులను ఫాలో అవుతున్నట్లు అసభ్యపదజాలంతో ఆమె క్యారెక్టర్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై..

పాల్వంచరూరల్‌: మిర్చి పరదాల విషయంలో తలెత్తిన వివాదంలో మహిళను చంపుతానని బెదిరించి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధి నాగారం గ్రామానికి చెందిన అరేపల్లి ప్రమీల, జలగం అనిల్‌ పక్కనే మిర్చి పంట కల్లాలు చేసుకున్నారు. పంటపై రక్షణ కప్పే పరదాల విషయంలో శనివారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనిల్‌ తనను చంపుతానని, రాళ్లతో కొట్టడానికి వచ్చాడని అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు ప్రమీల ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణ తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు

కరకగూడెం: ట్రాక్టర్‌ బోల్తా పడి ఓ వ్యక్తి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కౌలూరు గ్రామానికి చెందిన మలకం రమేష్‌ ఆదివారం తన ట్రాక్టర్‌తో పని నిమిత్తం చిరుమళ్ల గ్రామం వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో చిరుమళ్ల ఎస్సీ కాలనీ మూలమలుపు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ పల్టీ కొట్టి పక్కనే ఉన్న పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రమేష్‌పై ట్రాక్టర్‌ పడగా.. కొందరు యువకులు గమనించి ట్రాక్టర్‌ను పక్కకు జరిపారు. అనంతరం 108లో అతడిని కరకగూడెం పీహెచ్‌సీకి ఆపై మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement