● ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం వరకే అంగన్వాడీ కేంద్రాలు ● ఒకేపూట నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం ● వేసవిలో చిన్నారులకు ఉపశమనం
భద్రాచలంఅర్బన్ : ప్రభుత్వ పాఠశాలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలను సైతం ఈ ఏడాది వేసవికాలంలో ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచే భానుడు భగ్గుమంటుండగా మార్చి రెండో వారం నుంచి ఉష్టోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిన్నారుల తల్లిదండ్రుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరుకు గదుల్లో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే చిన్నారులకు ఉపశమనం కలుగుతోంది. పాఠశాలలను మాత్రమే హాఫ్డే స్కూళ్లు నిర్వహించే ప్రభుత్వం ఈసారి అంగన్వాడీ కేంద్రాలకూ ఈ అవకాశం కల్పించింది. ఈనెల 15 నుంచే ఈ నిర్ణయం అమలు కాగా, మే 31 వరకు ఒక్కపూటే కేంద్రాలు కొనసాగుతాయని, ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తాయని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లే ఉత్తర్వులు జారీ చేశారు.
చిన్నారులకు ఉపశమనం..
జిల్లా వ్యాప్తంగా 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 853 మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 445 సెంటర్లను ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. 762 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 5,967 మంది గర్భిణులు, 6,681 మంది బాలింతలు, మూడేళ్ల లోపు చిన్నారులు 30,941 మంది, 3 – 6 ఏళ్ల లోపు వారు 25,479 మంది ఉన్నారు. అద్దె భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉండగా వేసవిలో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు పంపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను సైతం ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో చిన్నారులకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. ఇదిలా ఉండగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో ఫ్యాన్లు లేవు. తగినంత గాలి, వెలుతురు లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలు వేడితో ఇబ్బంది పడుతున్నారు.
ఉత్తర్వులు అందాయి
అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని రాష్ట్ర మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే కేంద్రాలు నిర్వహిస్తున్నాం. మే 31 వరకు ఇలాగే కొనసాగుతాయి. దీంతో చిన్నారులకు కొంత ఇబ్బంది తగ్గుతోంది.
– స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి
మధ్యాహ్నం వరకే..
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. వేసవి కాలం దృష్ట్యా మధ్యాహ్నం 12.30 గంటల వరకే వారికి ఆహారం సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎండ, ఉక్కపోతతో చిన్నారులు, గర్భిణులకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని, ఆ సమయంలో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే 12.30 గంటల వరకే అయినా ఎండ ప్రభావం పడుతుందని, ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, పనిచేయని చోట మరమ్మతు చేయించాలని, సరైన వసతులు కల్పించాలని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.
అంగన్వాడీల్లోనూ ‘హాఫ్ డే’