అశ్వారావుపేటరూరల్: ఎన్నికల సీజన్లో తరచూ ‘బైండోవర్’ అనే పదం వినిపిస్తుంది. పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేస్తూ ఉంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లు, నేరాలు, అక్రమంగా మద్యం, సారా, గంజాయి విక్రయాలు చేసే వారే కాకుండా ఎలాంటి నేరం చేయకపోయినా, అనుమానాస్పద వ్యక్తులపై కూడా పోలీస్ శాఖకు బైండోవర్ కేసులు నమోదు చేసే అధికారం ఉంటుంది. ఈ కేసుల్లో అరెస్టు చేసిన వారిని తహసీల్దార్ ఎదుట హాజరుపరుస్తారు(బైండోవర్ చేస్తారు). బైండోవర్ చేసిన వ్యక్తి తరఫు వారి నుంచి పూచీకత్తు తీసుకుని బాండ్ పేపర్పై రాయించుకొని ఆ తర్వాత విడుదల చేస్తారు. ఒకసారి బైండోవర్ అయినా వ్యక్తి ఆరు నెలలలోపు చట్ట వ్యతిరేక చర్యలు, అల్లర్లు, ఘర్షణలకు పాల్పడినా, ప్రవర్తనలో మార్పు రాకపోయినా కేసు నమోదు చేసి రూ.లక్ష వరకు జరిమానా, ఒక్కోసారి జైలు శిక్ష సైతం విధిస్తారు.


