యద్దనపూడి: మానసిక సమస్యలతో బాధపడుతూ ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రమైన యద్దనపూడిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రత్నకుమారి తెలిపిన వివరాలు.. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న తురిమెళ్ల మంగమ్మ(49) బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ యద్దనపూడి గ్రామంలో ఒక అద్దె ఇంటిలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం ఆస్పత్రిలో విధులకు హాజరైన ఆమె మంగళవారం వెళ్లలేదు. ఇరుగుపొరుగు వారికి ఇంటి వద్ద కన్పించింది. బుధవారం ఆమె ఇంటి తలుపులు వేసి ఉండటంతో ఇరుగుపొరుగు వారు తలుపు కొట్టి చూడగా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె స్వగ్రామం వినుకొండ కాగా సంతమాగులూరు వైద్యశాలలో విధులు నిర్వహించి 13 నెలల క్రితం యద్దనపూడికి బదిలీపై వచ్చింది. ఆమె భర్త నారాయణ 20 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తూ చనిపోవడంతో కారుణ్య నియామక ప్రక్రియలో మంగమ్మకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం వచ్చింది. ఆమెకు కుమారుడు ఉన్నాడు.


