రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు | - | Sakshi
Sakshi News home page

రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు

నరసరావుపేట రూరల్‌: పది వేలు చెల్లిస్తే పది కోట్లు ఇస్తామంటూ స్కీమ్‌ను ప్రారంభించి అమాయక ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని నరసరావుపేట రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ శివారు ప్రాంతమైన కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్‌టీ నగర్‌లో రెండు రోజుల క్రితం చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు కార్యాలయాన్ని ప్రారంభించాడు. వెంకట్రావు కోకోనట్‌ మర్చంట్‌ పేరుతో ప్రారంభించిన కార్యాలయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రూరల్‌ సీఐ ఎంవీ సుబ్బారావు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో స్కీమ్‌లో సభ్యుల నుంచి నిర్వాహకులు ఈకేవైసీ తీసుకుంటున్నట్టు సేకరిస్తున్నట్టు గుర్తించారు.

గిఫ్ట్‌ మనీ పేరుతో టోకరా..

రాకేట్‌ ల్యాబ్‌ పేరుతో వెంకట్రావు గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గిఫ్ట్‌ మనీ స్కీమ్‌ను నిర్వహిస్తున్నాడు. స్కీమ్‌లో చేరిన సభ్యులు మొదటగా రూ.10 వేలు చెల్లిస్తే రూ.10 కోట్లు వరకు లబ్ధిపొందవచ్చని నమ్మబలుకుతున్నాడు. తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో అధిక సంఖ్యలో స్కీమ్‌లో సభ్యులుగా చేరుతున్నారు. ఇందుకోసం 500 మంది వరకు ఏజెంట్లు ఈ స్కీమ్‌లో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి దాదాపు నాలుగు వేల మందిని స్కీమ్‌లో సభ్యులుగా చేర్చినట్టు తెలుస్తుంది. స్కీమ్‌లో చేరి రూ.10 వేలు చెల్లించిన నాలుగు రోజుల తరువాత సింగపూర్‌లో వారి పేరుపై అకౌంట్‌ ప్రారంభించి రూ.3 లక్షలు జమ చేసినట్టు నమ్మించేందుకు నకిలీ సందేశాలు పంపుతారు. నెల రోజుల తరువాత రూ.10 కోట్లు జమ చేస్తామని నమ్మబలికి ఇప్పటికే రూ.కోట్లులో వసూలు చేసినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement