చీరాల రూరల్: జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం వేటపాలెంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ కొండయ్య తెలిపిన వివరాలు.. వేటపాలెం పందిళ్లమ్మ గుడి సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో సిబ్బంది పరిశీలించగా మృతుడి వద్ద ఎటువంటి సమాచారం లభించలేదని చెప్పారు. మృతుని వయస్సు 55 ఏళ్లు ఉంటాయని, 5.5 అడుగుల ఎత్తు చామన ఛాయ కలిగిన రంగు కలిగి ఉన్నాడని తెలిపారు. గడ్డంతో పాటు తల వెంట్రుకలు బాగా పెరిగి ఉన్నాయని, మృతుని శరీరంపై తెలుపు రంగు కలిగిన ఆఫ్ హ్యాండ్స్ టీషర్టు, బులుగు, తెలుపు మెరూన్ చెక్స్ కలిగిన లుంగీ ఉందని తెలిపారు. మృతుని చిరునామా ఎవరికై నా తెలిసినట్లయితే జీఆర్పీ పోలీసులకు 9247575633 సమాచారం అందించాలని సూచించారు.
చేపల పట్టివేతపై రెవెన్యూ విచారణ
ముప్పాళ్ల: ‘మట్టిపై కన్నేస్తే... చేపలు దొరికాయ్..’ అంటూ సాక్షిలో వచ్చిన కథనం పై రెవెన్యూ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. మండలంలోని బొల్లవరం గ్రామ సమీపంలో ఉన్న ఏడు ఎకరాల భూమిలో తవ్విని చెరువులో మట్టి తవ్వకాలు చేసేందుకు గాను నీళ్లు వెళ్లే బెట్టే క్రమంలో దొరికిన చేపల ఆదాయం కోసం టీడీపీ నాయకులు పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం బయటకు పొక్కటంతో రెవెన్యూ అధికారులు చెరువు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఫొటోలలో సేకరించారు. అక్కడి వారి నుంచి వివరాలు సేకరించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఆర్ఐ ఆంజనేయులు, వీఆర్వోలు తెలిపారు. చెరువులో నీటిని బయటకు పంపినట్లుగా గుర్తించామని, పరిశీలించే సమయంలో చిన్నపాటి చేపలు బాక్స్ల్లో ఉండటాన్ని గుర్తించారు. అన్ని పనులు వెంటనే నిలిపివేయాలని, పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతితోనే తదుపరి చర్యలు చేపట్టాలని అక్కడ ఉన్న వారిని ఆదేశించారు. అనుమతులు లేకుండా పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


