చినగంజాం: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం చినగంజాం పోలీస్ స్టేషన్లో ఇంకొల్లు సీఐ ఎం రామానాయక్, ఎస్ఐ శీలం రమేష్లు నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు.. శుక్రవారం స్థానిక పోలీసులు, జీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న కేరళం రాష్ట్రానికి చెందిన సుహైబ్ రెహమాన్ (30) అనే వ్యక్తిని పట్టుకున్నారు. చినగంజాం ఎస్ఐ శీలం రమేష్ తన సిబ్బందితో కలిసి నేరస్తుడిని అదుపులోనికి తీసుకొని విచారించగా ఒడిశాలోని రాయ్గఢ్లో ఓ వ్యక్తి వద్ద రూ.30 వేలకు 6.490 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తన ట్రావెల్ బ్యాగ్లో దాచుకొని రైలులో కేరళంకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అతనిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతంలో నిందితుడు గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడినట్లు, కేరళంలోని హోస్బుర్గ్ పోలీస్ స్టేషన్లో నాలుగు గంజాయి కేసులు, ఒక దాడి కేసు నమోదైనట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాలతో అతనిని రిమాండ్ కు పంపించారు.


