
ఏపీ టాక్స్ బార్ అధ్యక్షుడిగా రామరాజు శ్రీనివాసరావు
గుంటూరు వెస్ట్ : ఏపీ టాక్స్ బార్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన ప్రముఖ ఆడిటర్ రామరాజు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రస్తుత అధ్యక్షుడు ఎం.వి.జె.కె. కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 15న జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. జూలై 1 నుంచి పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఈ పదవిలో రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతారన్నారు. 2000 పైగా ప్రాక్టీషనర్స్, చార్డెర్డ్ అక్కౌంటెంట్స్, న్యాయవాదులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు గతంలో ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్, కన్సల్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ ( సదరన్ ) చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారన్నారు. పలు సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం సంస్థకు ఎంతో ప్రయోజనమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు కోట సునీల్, ఏ.వి.ఎస్. కృష్ణ మోహన్, చక్ర రమణ, ఫణి కుమార్, సురేష్లతోపాటు పలువురు ఆడిటర్లు, చార్టెర్డ్ అక్కౌంటెంట్లు అభినందనలు తెలిపారు.