
ప్రారంభమైన వేధింపుల పర్వం
సత్తెనపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో రెంటపాళ్ల చుట్టూ పోలీసులు బారికేడ్లు పెట్టి ప్రధాన రహదారిలో సైతం రాకపోకలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చేవారిని సైతం ఆధార్ కార్డులు చూపాలంటూ ఆంక్షలు విధించడమే కాక అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించిన వారిని వేధించడం ప్రారంభించారు. దీనిలో భాగంగా క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన గొర్రెపాటి జాన్, అచ్చంపేటకు చెందిన బాల సైదాలను సత్తెనపల్లి రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఎవరెవరైతే బారికేడ్ల వద్ద తాము వెళ్లాలంటూ గట్టిగా చెప్పారో వారిని గుర్తించి వేధించేందుకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు నోటీసులు సైతం ఇచ్చారు. ప్రస్తుతం ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.