
కలెక్టర్ గారూ అంతా ఓకే అట!
ప్రజా వేదికలో కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
సమస్య పరిష్కరించినట్లు ఆన్లైన్లో అప్లోడ్
శృతి మించుతున్న మండలస్థాయి అధికారుల ప్రవర్తన
జిల్లా మేజిస్ట్రేట్ మాటలకే పంగనామాలు
జె.పంగులూరు: జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాలకే విలువ లేకుండా పోతోంది. పని చేయకుండానే చేసినట్లు ఏకంగా ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తున్న మండ ల స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అంతా డొల్లేనని తేటతెల్లం చేస్తున్నారు. మండల పరిధిలో వివిధ కారణాలు వల్ల పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళతారు. కలెక్టర్ పరిష్కరిస్తారనే నమ్మకంతో అర్జీ ఇచ్చి వారి సమస్యలను విన్నవించుకుంటారు.
ఆ సమస్యను పరిష్కరించమని తిరిగి మండలాలకు కలెక్టర్ కా ర్యాలయం నుంచి వస్తాయి. కానీ మండల అధికారులు అర్జీదారునితో మాట్లాడకుండానే సమస్య పరిష్కరించినట్లు కలెక్టర్కు రిపోర్టులు పంపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పంగులూరు గ్రామానికి చెందిన పాలపర్తి ఏలియా రెండు నెలల క్రితం కలెక్టర్కు నివేశన స్థలానికి సంబంధించి కలెక్టర్కు అర్జీ పెట్టాడు. ఆ అర్జీ జె.పంగులూరు మండల తహసీల్దార్కు వచ్చింది.
కానీ ఇక్కడ తహసీల్దార్ అర్జీదారునితో మాట్లాడకుండానే సమస్య పరిష్కారమైనట్లు నివేదికను పై అధికారులను పంపించారు. అర్జీదారునికి తెలియకుండా అతని ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈవిషయమై అర్జీదారుని కి సమస్య పరిష్కారం అయిందని మెసేజ్తోపాటు ఫోన్ చేశారు. దీంతో అర్జీదారుడు తనను సంప్రదించకుండా నా అర్జీని ఎలా పరిష్కరిస్తారని తహసీల్దార్ని అడగగా వారి వద్ద నుంచి సరైన సమాధానం లేదు. జె.పంగులూరు మండ లం నుంచి బాపట్ల వెళ్లాలంటే సుమారు 60 కిలోమీటర్లు. వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందించినా ఉపయోగం లేకుండా పోతోంది.